క్రికెట్ చరిత్రలో చాలా ప్రశాంతంగా, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆటగాళ్ల పేర్లు వరుసగా రాస్తే.. ఆ జాబితాలో కచ్చితంగా ఉండే పేరు సచిన్ టెండూల్కర్. మైదానంలో ఎప్పుడూ కామ్గా కనిపించే సచిన్.. 24 సంవత్సరాల పాటు ఈ క్రీడకు సేవ చేశాడు. తన క్రికెట్తో దేశాన్ని ఏకం చేశాడు. అలాంటి సచిన్ కూడా కొన్ని సార్లు కోపం తెచ్చుకోవడం సహజమే.
అలాంటి ఒక ఘటనను టీమిండియా మాజీ లెజెండ్ హర్భజన్ సింగ్ గుర్తుచేసుకున్నాడు. 2000వ సంవత్సరంలో ఆస్ట్రేలియాతో టెస్టు ఆడుతున్నామని, అప్పుడే తను ఒక పొరపాటు చేశానని భజ్జీ వెల్లడించాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తను.. ఆటపై ధ్యాస పెట్టలేదట. ఆ టైంలో జట్టు కెప్టెన్గా ఉన్న సచిన్కు ఇది ఏమాత్రం నచ్చలేదు. దీంతో భజ్జీ దగ్గరకు వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట.

ఈ విషయాన్ని త్వరలో రిలీజ్ అవబోయే సచిన్@50 పుస్తకంలో భజ్జీ రాసుకొచ్చాడు. ఆ సమయంలో సరిగా ఫీల్డింగ్ చేయకపోవడంతో భజ్జీ దగ్గరకు వచ్చిన సచిన్.. 'భజ్జీ, ఒక విషయం బాగా గుర్తుంచుకో. నువ్వు నా మంచితనం మాత్రమే ఇప్పటి వరకు చూశావు. కానీ కావాలంటే నేను కూడా కోప్పడతాను. రూడ్గా, అమర్యాదగా ప్రవర్తిస్తాను. నేను అలా మారితే నువ్వు చూడలేవు. కాబట్టి కాన్సన్ట్రేల్ చేసి ఆడు' అని సచిన్ హెచ్చరించాడట.
ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ షాకైపోయారు. ఎప్పుడూ నవ్వుతూ ప్రశాతంగా ఉండే సచిన్ ఇలా బడా డాన్లా వార్నింగ్ ఇవ్వడాన్ని ఊహించుకోలేక పోతున్నాం అంటున్నారు. సచిన్కు కోపం వస్తే ఇంత సైలెంట్గా వార్నింగ్ ఇస్తాడా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇలా కేవలం సీరియస్గా మాట్లాడటమే కాదు.. సచిన్ తన కెరీర్లో కీలక పాత్ర పోషించాడని కూడా భజ్జీ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో తను ఎదిగే క్రమంలో సచిన్ ఎన్నో విలువైన సలహాలు ఇచ్చినట్లు వెల్లడించాడు.
'ఒక టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత కుర్చీ తెచ్చుకొని నా పక్కనే కూర్చున్నాడు. భజ్జీ.. నువ్వెప్పుడైనా గుర్రపు పందేలు చూశావా? ఆ రేస్లో పరిగెత్తే గుర్రాలు పక్కలకు చూడవు. స్ట్రెయిట్గా మాత్రమే చూస్తాయి. టార్గెట్ మీదనే ఫోకస్ పెడతాయి. నువ్వు కూడా అలా అవ్వాలి. ఇప్పుడు వచ్చిన స్టార్డమ్ చూసి డిస్ట్రాక్ట్ అయిపోకూడదు' అని సచిన్ సలహా ఇచ్చినట్లు భజ్జీ పేర్కొన్నాడు.