
టెన్నిస్ టోర్నీలో హీరో
క్రికెట్లో సూపర్ స్టార్గా ఉన్న ధోనీ.. స్థానికంగా టెన్నిస్లో కూడా హీరోగానే వెలుగొందుతున్నాడు. జార్ఖండ్లో ఏటా జరిగే జేఎస్సీఏ టెన్నిస్ టోర్నమెంట్లో మరోసారి సత్తా చాటాడు. స్థానిక టెన్నిస్ ప్లేయర్ సుమీత్ కుమార్ బజాజ్తో జత కట్టిన ధోనీ.. పురుషుల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో గెలవడం ఇది ధోనీకి వరుసగా మూడో సారి కావడం గమనార్హం. అందుకే అతన్ని ఫ్యాన్స్ ట్రోఫీ మ్యాగ్నెట్ ధోనీ అని పిలుస్తున్నారు.

వీడియో వైరల్..
ఈ టోర్నీ అనంతరం డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన ధోనీ, సుమీత్ కలిసి ట్రోఫీ అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక అభిమాని నెట్టింట పంచుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాంచీలోని జేఎస్సీఏ స్టేడియంలో టెన్నిస్ ఆడుతూ చాలా మంది కంట పడ్డాడు. తనకు ఈ క్రీడపై ఉన్న ఆసక్తిని కూడా పలుమార్లు అభిమానులతో పంచుకున్నాడు. మూడేళ్లుగా ఈ టోర్నమెంట్లో పాల్గొంటూ విజేతగానే నిలుస్తున్నాడు.

వచ్చే ఐపీఎల్లో..
భారత జట్టుకు రెండు ప్రపంచకప్లు అందించిన ధోనీ.. ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఆ జట్టుకు నాలుగు ట్రోఫీలు అందించాడు. గతేడాది కెప్టెన్సీని వదులుకొని స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అయితే 8 మ్యాచుల తర్వాత మళ్లీ పగ్గాలు అందుకున్నాడు. ఈ ఏడాది మళ్లీ జట్టుకు ధోనీనే నాయకత్వం వహించనున్నాడు. చెన్నైతో తన అభిమానుల ముందు చివరి మ్యాచ్ ఆడాలనే ఆశ వ్యక్తం చేసిన ధోనీ.. వచ్చే ఐపీఎల్ తర్వాత క్రికెట్కు గుడ్బై చెప్తాడని వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications
