
టీమిండియా యువ కెరటం రిషభ్ పంత్కు ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. శరీరమంతా గాయాలతో ఉన్న అతన్ని రూర్కీలోని మ్యాక్స్ హాస్పిటల్కు తరలించారు. ఈ నేపథ్యంలో పంత్ ఆరోగ్యం గురించి అభిమానులు తెగ ఆందోళన చెందారు. అతనికి ఎలా ఉందో తెలుసుకోవడానికి బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి ఫోన్ల మీద ఫోన్లు చేశారు. దీంతో బీసీసీఐ రిసెప్షనిస్టులకు పిచ్చెక్కిపోయిందట.
కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో తల్లికి సర్ప్రైజ్ ఇద్దామని పంత్ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందని సమాచారం. వేగంగా వెళ్తుండగా అతని కారు డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో కిటికీ అద్దం పగలడంతో దానిలో నుంచి బయట పడేందుకు పంత్ ప్రయత్నించాడు. ఆలోపే వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక హరియాణా బస్సులో డ్రైవర్ సుశీల్ కుమార్.. తన బస్సును రోడ్డు పక్కన ఆపేసి కిందకు పరిగెత్తుకొచ్చాడు. కారు కిటికీలో నుంచి సగం బయటకు వచ్చిన పంత్ను పూర్తిగా బయటకు లాగి, ఒక బెడ్షీట్తో అతన్ని కప్పాడు. వెంటనే అంబులెన్సుకు సమాచారం అందించాడు.
దీంతో చాలా మంది అభిమానులు బీసీసీఐకి కాల్ చేసి పంత్ ఏ ఆస్పత్రిలో ఉన్నాడని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరికొందరేమో అతని గాయాల తీవ్రత గురించి ఆరా తీశారు. పంత్ ఎంతకాలం క్రికెట్కు దూరమవుతాడు? ఎలాంటి గాయాలు తగిలాయి? అంటూ రకరకాల ప్రశ్నలు వేశారట. ఈ కాల్స్ను బీసీసీఐ తట్టుకోలేకపోయిందట. అందుకే అతని గాయంపై అధికారికంగా ప్రకటన విడుదల చేసి, పంత్కు ఎలాంటి గాయాలయ్యాయో వివరించింది. అతను ఏ ఆస్పత్రిలో ఉంది కూడా వెల్లడించింది. రూర్కీలోని ఆస్పత్రి నుంచి అతన్ని ఢిల్లీ లేదా ముంబైకి తరలిస్తామని తెలిపింది. ఏదేమైనా పంత్ కనీసం మరో మూడు నెలలపాటు ఆటకు దూరమవక తప్పదని నిపుణులు అంటున్నారు.