వన్డే వరల్డ్ కప్కు ముందు ఆస్ట్రేలియా టీంకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవల యాషెస్ సిరీసులో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా టీం.. సౌతాఫ్రికాతో వైట్ బాల్ సిరీస్కు రెడీ అవుతోంది. అయితే ఈ సిరీసుకు నలుగురు ఆసీస్ స్టార్లు దూరమయ్యారు. ఈ సిరీస్ ఆరంభంలోనే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టుకు దూరమయ్యాడు.
మణికట్టుకు దెబ్బ తగలడంతో అతను ఈ సిరీసుకు దూరమయ్యాడు. దీంతో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు జట్టు పగ్గాలు అందించాలని ఆసీస్ క్రికెట్ బోర్డు భావించింది. అయితే యాషెస్ సిరీసులో అతని ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది. ఈ సిరీసులో చాలాసార్లు అతను మణికట్టు సమస్యతో ఇబ్బంది పడటం కనిపించింది.

దీంతో అతను కూడా సఫారీ టూర్కు దూరమయ్యాడు. అదే సమయంలో ఆ టీం స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్కు కూడా గాయమైంది. అతనికి కూడా మణికట్టు సమస్యతో పాటు గజ్జల్లో నొప్పి రావడంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇలా వరుసగా కీలకమైన ఆటగాళ్లకు గాయాలు అవడంతో ఆ టీం ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
ఇప్పుడు వీరందరికీ బిగ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్ మరో షాకిచ్చాడు. అతను మడమ గాయంతో సఫారీ టూర్కు దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అయితే ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని సీఏ తెలిపింది.
భారత్తో సిరీస్ నాటికి మ్యాక్స్వెల్ తిరిగి జట్టుతో చేరతాడని ధీమా వ్యక్తం చేసింది. అలాగే స్మిత్ లేకపోవడంతో టెస్టు స్పెషలిస్టు మార్నస్ లబుషేన్కు ఈ సిరీసులో అవకాశం దక్కనుంది. అతను కనుక రాణిస్తే.. వరల్డ్ కప్ ఆడే జట్టులో కూడా అతనికి అవకాశం దక్కొచ్చు. ఈ సిరీసులో మిచెల్ మార్ష్కు జట్టు పగ్గాలు అందిస్తున్నట్లు సీఏ పేర్కొంది.
అయితే ఈ గాయాల వార్తలన్నీ అబద్ధాలేనని ఫ్యాన్స్ అంటున్నారు. వరల్డ్ కప్ వంటి కీలకమైన టోర్నీకి ముందు గాయాలపాలయ్యే అవకాశం ఉన్న ప్లేయర్లకు ఆసీస్ టీం ఇలా విశ్రాంతి ఇస్తోందని అంటున్నారు. సరిగ్గా వరల్డ్ కప్ సమయానికి వీళ్లంతా కోలుకొని జట్టుతో చేరుకుంటారని జోస్యం చెప్తున్నారు.