భారత్తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడే ఆస్ట్రేలియా జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సిరీస్ ఆరంభానికి ముందే ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వేలికి గాయమైంది. సౌతాఫ్రికాతో సిరీస్ సందర్భంగా అతనికి ఈ గాయమైంది. దీంతో అతను భారత్తో జరిగే తొలి టెస్టుకు దూరమయ్యాడు. అదే సిరీస్లో గాయపడిన యువ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా భారత్లో జరిగే తొలి టెస్టులో బౌలింగ్ చేయడం అసాధ్యం అని తేలిపోయింది. రెండో టెస్టులో కూడా అతను బౌలింగ్ చేయడం అనుమానమే అని వైద్య నిపుణులు చెప్పారు.
దీంతో ఆ జట్టు కొంత ఇబ్బందుల్లో పడింది. అలాంటి సమయంలో ఆసీస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మరో స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ కూడా ఈ సిరీస్ ఓపెనర్ మ్యాచ్కు దూరమవుతున్నట్లు ఆస్ట్రేలియా టీం ప్రకటించింది. సౌతాఫ్రికా సిరీస్లోనే హాజిల్వుడ్ కాలికి కూడా గాయమైందట. అది అంత పెద్ద సమస్యాత్మకంగా లేకపోవడంతో హాజిల్వుడ్ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడా గాయం తిరగబెట్టింది. ప్రాక్టీస్ సమయంలో కాలు బాగా నొప్పి రావడంతో అతను కూడా తొలి టెస్టు ఆడటం లేదని ఆసీస్ టీం వెల్లడించింది.
ఈ వార్తలు విన్న భారత అభిమానులు నెట్టింట తెగ జోకులు పేలుస్తున్నారు. ముగ్గురు కీలక బౌలర్లు ఈ సిరీస్ తొలి టెస్టులో లేకపోవడం భారత్కు కలిసొస్తుందని అంటున్నారు. అదే సమయంలో ఆసీస్ కీలక బ్యాటర్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్కు కూడా మ్యాచ్ ముందే గాయమైతే ఇక సిరీస్ మనదే అంటూ జోకులు పేలుస్తున్నారు. తమ పేసర్లు ఏ పరిస్థితుల్లో అయినా రాణిస్తారని చెప్పిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు ఇది చాలా గట్టి దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ జట్టులో అతనొక్కడే అనుభవం ఉన్న పేసర్.