కోహ్లీ డబుల్ సెంచరీ మిస్
తనకు సహకారం అందించే బ్యాటర్ లేకపోవడంతో కోహ్లీ భారీ షాట్లు ఆడాల్సి వచ్చింది. అప్పటికి ఎనిమిది గంటలుగా బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ.. మూడో రోజు ఆటలో గిల్తో, నాలుగో రోజున భరత్, అక్షర్తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కానీ చివరకు అతనికి మాత్రం సహకారం లేకుండా పోయింది. కేవలం షమీ మాత్రమే నాన్స్ట్రైకర్ ఎండ్లో మిగిలిపోయాడు. దీంతో కోహ్లీ భారీ షాట్లు ఆడబోయాడు. అంతసేపు క్రీజులో ఉన్న అతను అప్పుడు భారీ షాట్లు ఆడటం చాలా కష్టం. దీంతో మర్ఫీ బౌలింగ్లో సిక్సర్ కొట్టబోయి పెవిలియన్ చేరాడు. భారత్ ఇన్నింగ్స్ కూడా కోహ్లీ వికెట్తో ముగిసింది.

శ్రేయాస్ ఎక్కడ?
ఇలా కోహ్లీ డబుల్ సెంచరీ మిస్ అవడం చూసిన అభిమానులు షాకైపోయారు. అతనికి సహకారం అందించాల్సిన శ్రేయాస్ అయ్యర్ ఎక్కడ? అంటూ తెగ ట్వీట్లు చేస్తున్నారు. అతను వెన్నునొప్పితో మ్యాచ్కు దూరమైనట్లు తెలిసి మరింత చికాకు పడుతున్నారు. ఈ సిరీస్ తొలి మ్యాచులో కూడా వెన్ను నొప్పి కారణంగా శ్రేయాస్ ఆడలేదు. ఆ తర్వాత జట్టుతో కలిసినా పెద్దగా రాణించలేదు. అహ్మదాబాద్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో కచ్చితంగా అతను కూడా రాణిస్తాడని అంతా అనుకున్నారు. కానీ సరిగ్గా ఆ సమయానికి అతనికి మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టింది.

గాయంతో అయ్యర్కు తిప్పలు..
అయ్యర్ ఇలా గాయంతో జట్టుకు దూరం అవడంతో మరో ప్రశ్న తలెత్తింది. ఈ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ జరగనుంది. మరి వెన్నునొప్పితో బాధ పడుతున్న అయ్యర్ ఈ సిరీస్లో ఆడతాడా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకుముందు కివీస్తో జరిగిన వన్డే సిరీస్లో కూడా అయ్యర్ ఈ వెన్నునొప్పి కారణంగానే ఆడలేదు. గతేడాది వన్డే, టెస్టుల్లో భారత్ తరఫున అద్భుతంగా రాణించిన అతను.. ఈ ఏడాదిలో మాత్రం గాయం కారణంగా కీలకమైన అవకాశాలు కోల్పోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన వన్డే వరల్డ్ కప్లో అయ్యర్ ఆడతాడా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












