ఐపీఎల్ 2025లో అగ్ర జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ.. విమర్శలను అందుకుంటున్నాయి. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో ఓడి పాయింట్ల పట్టికలో 8,9 స్థానంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్.. ఈ రెండు బడా జట్లు ఇలాంటి చెత్త ప్రదర్శన చేయడానికి, బలహీనపడటానికి కారణం బీసీసీఐ అంటూ నిందిస్తున్నారు. అందుకు గల కారణాలు వివరిస్తున్నారు.
గత ఐదేళ్లలో ప్రదర్శన..
సీఎస్కే, ముంబయి.. లీగ్ చరిత్రలో చెరో ఐదు టైటిళ్లతో అత్యధిక ట్రోఫీలు అందుకున్న జట్లుగా కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో(2021,2023)సీఎస్కే రెండు ట్రోఫీలను ముద్దాడగా.. ముంబయి ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. చివరిసారిగా 2020లో విజేతగా నిలిచింది. ఇక 2021 నుంచి చూస్తే ఆ సీజన్ లో సీఎస్కే టైటిల్ సాధిస్తే.. ముంబయి ఇండియన్స్ ఐదో స్థానంలో ఉండి, ప్లే ఆఫ్స్ కు కూడా చేరుకోలేదు. 2022లో మరో రెండు కొత్త జట్లు రావడంతో మొత్తం 10 అయ్యాయి. ఆ సీజన్ లో సీఎస్కే 9, ముంబయి 10వ స్థానంలో నిలిచాయి. 2023లో మళ్లీ సీఎస్కే గెలవగా, ముంబయి ప్లే ఆఫ్స్ కు చేరి, నాలుగో స్థానంతో ముగించింది. 2024లో సీఎస్కే, ముంబయి 5,10 స్థానాల్లో నిలిచారు. అంటే ముంబయి గత నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే ప్లే ఆఫ్స్ చేరింది.

మరికొంతమంది.. "గత మెగా ఆక్షన్లో సీఎస్కే, ముంబయి కొన్ని తప్పిదాలు చేశాయి. సరైన ఆటగాళ్లను తీసుకోలేదు. పైగా ముంబయి రోహిత్ను కాదని హార్దిక్కు పగ్గాలు అప్పజెప్పడం ఏమాత్రం ఉపయోగపడలేదు. అలానే సీఎస్కే.. మొదట సారథిగా నియమించిన జడేజా, ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ సరిగ్గా జట్టును నడిపించలేకపోతున్నారు. కానీ ఇతర జట్ల కొత్త సారథులు మాత్రం బానే రాణిస్తున్నారు." అని అంటున్నారు.