మరికాసేపట్లో ఐపీఎల్-2024 ఫైనల్ ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో విజయాలతో హోరెత్తిస్తూ తుదిపోరుకు చేరింది. ఇక మరో విజయం సాధిస్తే సన్రైజర్స్ విజేతగా నిలుస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత ట్రోఫీని అందుకుంటుంది.
ఫైనల్లో బలమైన కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించడం తెలుగు టీమ్కు అంత సులువు కాదు. ఈ సీజన్లో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ కేకేఆర్దే విజయం. ఇక ఐపీఎల్లో ఓవరాల్గా ఇరు జట్లు 27 మ్యాచ్లు ఆడగా మూడింట రెండో వంతు కోల్కతానే నెగ్గింది. సన్రైజర్స్ తొమ్మిదింట్లోనే గెలిస్తే, కేకేఆర్ 18 మ్యాచ్ల్లో విజయఢంకా మోగించింది. దీంతో మాజీ క్రికెటర్లు సైతం ఫైనల్లో కోల్కతానే గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు.

కానీ ఫైనల్ పోరు అంటే ఈజీ కాదు. ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఆదిలోనే వికెట్లు కోల్పోయినా, ఛేదనలో కావాల్సిన రన్రేటు అధికంగా ఉన్నా ఒత్తిడికి చిత్తువుతుంటారు. నాకౌట్స్లో జట్టును విజయతీరాలకు చేర్చడంలో సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు అపారమైన అనుభవం ఉంది.వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కమిన్స్ తమ జట్టును గెలిపించకున్నాడు. ఇవాళ కూడా అదే జోరు ప్రదర్శించి కేకేఆర్పై విజయం సాధించాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది.
మరోవైపు ఫైనల్లో మన తెలుగు జట్టే గెలవాలని, ట్రోఫీని సాధించాలని కొందరు ఎస్ఆర్హెచ్ అభిమానులు పూజలు చేశారు. గుడికి వెళ్లి దేవునికి అభిషేకం చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోని ఆటగాళ్లు సత్తాచాటాలని కోరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా, తెలుగు ప్రజల అభిమానం అంటే ఇలానే ఉంటుందని వీడియోకు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్లో మూడు సార్లు ఫైనల్కు వెళ్లిన తెలుగు జట్టు రెండు సార్లు ట్రోఫీని సాధించింది. 2009లో గిల్క్రిస్ట్ నేతృత్వంలో డెక్కన్ ఛార్జర్స్, 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ టైటిళ్లను సాధించాయి. 2018లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ రన్నరప్గా నిలిచింది.