బీసీసీఐపై క్రికెట్ ఫ్యాన్స్ మరోసారి గుస్సా అవుతున్నారు. వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ మరోసారి మార్చాల్సి రావడమే దీనికి కారణం. కొన్ని రోజుల క్రితమే షెడ్యూల్లో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుందని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించిన సంగతి తెలిసిందే. మూడు సభ్య బోర్డులు ఈ మార్పుల కోసం డిమాండ్ చేసినట్లు జై షా తెలిపాడు.
ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ మారడంపై ఫ్యాన్స్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్లో నవరాత్రి ఉత్సవాలు ఉండటంతో ఈ మ్యాచ్కు భద్రత కల్పించలేమని పోలీసు అధికారులు స్పష్టం చేశారని, దీంతో ఈ మ్యాచ్ రీషెడ్యూల్ చేస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ మ్యాచ్ను ఒక రోజు ముందుకు జరిపినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు మరో మ్యాచ్ విషయంలో కూడా ఇలాంటి డెసిషన్ తీసుకురావలసి వచ్చింది. ఈ వరల్డ్ కప్లో నవంబరు 12న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే అదే రోజున కోల్కతాలో కాళీ పూజ నిర్వహిస్తారు. ఇది ఆ రాష్ట్రంలోని అతి పెద్ద పండుగల్లో ఒకటి.
దీంతో ఈ మ్యాచ్కు భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పారట. ఈ క్రమంలో ఈ మ్యాచ్ను కూడా రీషెడ్యూల్ చేయాల్సి వచ్చేలా ఉంది. కాళీ పూజ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలు పూజలు చేస్తారు. ఆయా ప్రాంతాల్లో భద్రత కల్పించడం పోలీసులకు పెద్ద పని. ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్కు భద్రత కల్పించడం అంత సులభం కాదు.
ఇలా ఈ మ్యాచ్ కూడా రీషెడ్యూల్ చేయాల్సి రావడంతో.. ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు బీసీసీఐకి బుర్ర ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎలాంటి ఆలోచనలతో ఈ షెడ్యూల్ తయారు చేశారని, భారత్లో ఉండే పండుగల గురించి బీసీసీఐకి తెలియదా? అని నిలదీస్తున్నారు. ఈ మార్పుల వల్ల ఫ్యాన్స్ తమ ప్లాన్స్ అన్నీ మార్చుకోవాల్సి వస్తుందని గుర్రుమంటున్నారు.