
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లో కోహ్లీ కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది. మిడిలార్డర్లో పంత్, శ్రేయాస్ లేకపోవడంతో కోహ్లీపైనే ఈ భారం అంతా పడుతుందని అంతా భావించారు. కానీ ఆ అంచనాలకు తగినట్లు కోహ్లీ రాణించలేదు. టెస్టుల్లో అసలే చెత్త ఫామ్లో ఉన్న అతను.. ఈ సిరీసులో అయినా మంచి ఇన్నింగ్స్ ఆడతాడని అంతా అనుకున్నారు.
ఛటేశ్వర్ పుజారా (7) విఫలం అవడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఈ మ్యాచ్లో మంచి స్కోరు చేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అది జరగలేదు. లంచ్ వరకు రోహిత్తో కలిసి మరో వికెట్ పడకుండా ఆడిన కోహ్లీ.. లంచ్ బ్రేక్ తర్వాత తను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. టాడ్ మర్ఫీ వేసిన బంతిని బ్యాక్ ఫుట్పై ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. లెగ్ సైడ్ బంతిని మరల్చేందుకు అతను ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని అందుకోవడంలో కీపర్ తడబడ్డాడు. అయితే రెండో ప్రయత్నంలో దాన్ని అందుకున్నాడు. దీంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇది చూసిన నెటిజన్లు కోహ్లీపై జోకులు పేలుస్తున్నారు. అతనికి అరంగేట్ర స్పిన్నర్లు అంటే చాలా ప్రేమని, అందుకే వాళ్లకు తన వికెట్ ఇచ్చేస్తుంటాడని మీమ్స్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో స్పిన్నర్లు కోహ్లీని ఒక ఆట ఆడుకుంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు.
ఏదేమైనా వన్డేల్లో, టీ20ల్లో ఫామ్ అందుకున్న కోహ్లీ.. టెస్టు ఫార్మాట్లో కూడా ఫామ్ అందుకోకుంటే టీమిండియాకు కష్టాలు తప్పవు. మిడిలార్డర్లో కోహ్లీ కన్నా అనుభవం ఉన్న ఆటగాడు లేడు. అతను కనుక ఫామ్ అందుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా, ఎలాంటి పిచ్పై అయినా భారీ స్కోర్లు చేయగలడు. కానీ అతను ఇటీవలి కాలంలో అవుటవుతున్న పద్ధతి చూస్తుంటే ఆటపై కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నట్లు కనిపిస్తోందని కొందరు నిపుణులు అంటున్నారు. మరి కోహ్లీ ఈ సిరీస్లో ఏం చేస్తాడో చూడాలి.