టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. విండీస్పై టెస్టులో సెంచరీ చేసిన తర్వాత అతనికి మళ్లీ మైదానంలో దిగే అవకాశం రాలేదు. అయితే వచ్చే ఆసియా కప్లో మరోసారి అతనే టీమిండియాకు కీలకం కానున్నాడు.
గతేడాది జరిగిన ఆసియా కప్లో కూడా భారత్ తరఫున కోహ్లీనే రాణించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, తాజాగా అంతర్జాతీయ క్రికెట్లో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కోహ్లీ.. తన 16వ క్రికెట్ సంవత్సరాన్ని హై నోట్లో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి అరుదైన బహుమతి ఇవ్వాలని ఒక అభిమాని అనుకుంటున్నాడు.

కోహ్లీ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా అతనికి వజ్రాలతో చేసిన ఒక బ్యాటు బహుమతిగా ఇవ్వాలని ఒక ఫ్యాన్ ఆశ పడుతున్నాడట. సూరత్కు చెందిన ఈ వ్యాపారి.. వన్డే వరల్డ్ కప్కు ముందు కోహ్లీకి ఈ బ్యాటు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. దీన్ని 1.04 క్యారట్ల ఒరిజినల్ డైమండ్తో తయారు చేస్తున్నారట.
ఈ బ్యాటు 15 మిల్లీమీటర్ల పొడవు ఉంటుందని సమాచారం. ఈ వజ్రం ధర మార్కెట్లో సుమారు రూ.10 లక్షలు ఉంటుందట. ఈ వజ్రాన్యి బ్యాటులా చెక్కడానికి నెలరోజుల పాటు కష్టపడాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో డంబుల్లా వేదికగా జరిగిన మ్యాచులో కోహ్లీ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఈ మోడ్రన్ గ్రేట్ను ఈ వజ్రాల వ్యాపారి ఫాలో అవుతున్నాడట.
ఈ 15 ఏళ్లలో కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదగడాన్ని కళ్లారా చూసిన సదరు వ్యాపారి.. ఆ ఆనందంతోనే ఈ వజ్రం బ్యాటు తయారు చేసినట్లు తెలుస్తోంది. సూరత్కు చెందిన ప్రముఖ వజ్రాల కంపెనీ లెక్సస్ సాఫ్ట్మాక్ కంపెనీ డైరెక్ట్ ఉత్పల్ మిస్త్రీ ఆధ్వర్యంలో ఈ బ్యాటును తయారు చేశారు. దీన్ని ప్రస్తుతం సర్టిఫికేషన్ కోసం పంపినట్లు ఈ కంపెనీ తెలిపింది.