
హైదరాబాద్: ఆదివారం మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 89 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. "టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేయాలి" పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫ్రాజ్ అహ్మద్కు ఆ దేశ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చేసిన సూచన.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
భారత్తో మ్యాచ్కు ముందు ఇమ్రాన్ ఖాన్ ఓ ట్వీట్ చేశారు. పిచ్, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పాక్ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలని సూచించారు. "పిచ్ మరీ తేమగా ఉంటే తప్ప.. టాస్ గెలవగానే పాక్ మొదట బ్యాటింగ్ చేయాలి. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, బౌలర్లతో బరిలో దిగాలి. ఒత్తిడి సందర్భాల్లో పార్ట్ టైమర్లు రాణించలేరు" అని ఇమ్రాన్ తెలిపాడు.
కానీ, టాస్ నెగ్గగానే సర్ఫ్రాజ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం గమనార్హం. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. అనంతరం 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ను 40 ఓవర్లకు కుదించారు.
దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ సమయంలో ఓ క్రికెట్ అభిమాని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ను ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. "సర్ఫరాజ్ .. మోటా.. టాస్ గెలిచినా బ్యాటింగ్ ఎందుకు తీసుకోలేదు? ఇమ్రాన్ ఖాన్ చెప్పింది కూడా వినలేదు. ప్రధాని మాటనే లెక్క చేయనప్పుడు ఎవరేం చేయగలరు" అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.