
హైదరాబాద్: ఆసీస్, కివీస్ ల మధ్య జరిగిన హోరాహోరీ టీ20లోఆస్ట్రేలియా భారీగా చేజింగ్ చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. దాంతో పాటు మ్యాచ్లో సిక్సుల వర్షం కురవగా.. ఈ మ్యాచ్ను తిలకించేందుకు వచ్చిన ఓ అభిమానికి కాసుల వర్షం కురిసింది.
ఇరు జట్లు 500పైగా పరుగులు నమోదు చేసి అభిమానులను హోరెత్తించగా.. రాస్ టేలర్ సిక్సర్ ఓ అభిమానికి ఏకంగా జాక్పాట్ తగిలేలా చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 19.5 ఓవర్లో టేలర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ సంధించాడు. ఆ బంతిని స్టాండ్స్లో నిల్చోన్న మిచెల్ గ్రిమ్స్టోన్ అనే 20 ఏళ్ల యువకుడు ఒంటిచేత్తో పట్టేశాడు.
ఈ క్యాచ్కు ముగ్ధులైన స్థానిక శీతల పానియాల కంపెనీ ఈ అభిమానికి రూ.24 లక్షలు( 50 వేల న్యూజిలాండ్ డాలర్లను) బహుమతిగా ప్రకటించింది. సాధారణంగా స్టాండ్స్లోకి ఆటగాళ్లు కొట్టిన బంతుల్ని క్యాచులు అందుకోవటం అభిమానులకు ఎంతో సరదా. ప్రతి మ్యాచ్లోనూ ఈ రకమైన వినోదం చూస్తూనే ఉంటాం. ఇలా తన సరదా కోసం ప్రయత్నిస్తే వెతుకొంటూ బహుమానం రావడంతో మిచెల్ ఆశ్చర్యానికి లోనయ్యాడు.
'నేను లెఫ్ట్ హ్యాండ్ కానప్పటికి ప్రయత్నించా. అనుకోకుండా బంతి నాకు చిక్కింది. అనంతరం అందరు నాపై పడ్డారు.' అని విద్యార్థి అయిన మిచెల్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ఆసీస్ గెలిచినప్పటికి మిచెల్కు బహుమానం రావడంతో కివీస్ అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిచెల్ క్యాచ్పై రాస్ టేలర్ సైతం అతన్ని ప్రశంసిస్తూ గ్లోవ్స్, మ్యాచ్ బంతిని బహుమానంగా ప్రకటించాడు.