కరాచీ: పాకిస్థాన్ టీ20 కెప్టెన్ షాహిత్ అఫ్రిది రెస్టారెంట్ బిల్లును ఓ పాక్ అభిమాని చెల్లించడం ఆయన్ను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. జనవరి 15 నుంచి న్యూజిలాండ్తో టీ20 సిరిస్ను ఆడేందుకు పాకిస్థాన్ జట్టు సోమవారం (జనవరి 11)న ఆక్లాండ్ విమానాశ్రయానికి చేరుకుంది.
విమానాశ్రయంలో దిగిన తర్వాత సహచర ఆటగాడు అహ్మద్ షెహజాద్తో కలిసి ఆక్లాండ్ విమానాశ్రయంలోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్కు ఆఫ్రిదీ వెళ్లాడు. బిల్లు చెల్లించే సమయంలో అఫ్రిదీ అమెరికా డాలర్లు ఇవ్వడంతో రెస్టారెంట్ సిబ్బంది వాటిని తీసుకోలేదు.

అంతేకాదు స్ధానిక కరెన్సీనే కావాలని రెస్టారెంట్ సిబ్బంది కోరారు. దీంతో రెస్టారెంట్లో ఉన్న పాక్ క్రికెట్ అభిమాని వకాస్ నవీద్ తన దగ్గరున్న న్యూజిలాండ్ కరెన్సీతో అఫ్రిది బిల్లును చెల్లించాడు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీయడంతో వాటిని పాక్ మీడియా ప్రసారం చేస్తూ అఫ్రిదీపై మండిపడింది.
దీంతో దీనిపై ఆఫ్రిదీ మంగళవారం తన ట్విట్టర్లో వివరణ ఇచ్చాడు. తమ దగ్గరనున్న అమెరికా డాలర్లను న్యూజిలాండ్ కరెన్సీలోకి మార్చుకోవడం మర్చిపోయామని ఆఫ్రిదీ తెలిపాడు. వెంటనే క్యూలో మా వెనుకున్న ఓ అభిమాని ఆ బిల్లును చెల్లించి, న్యూజిలాండ్కు ఆహ్వానించాడని చెప్పాడు.
కాగా, పాక్ క్రికెట్ జట్టుకు తాను పెద్ద ఫ్యాన్ అని వకార్ నవీద్ తెలిపాడు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఎవరో వీడియో తీయడంపై ఆయన ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఏది ఏమైనప్పటికీ పాక్ మీడియా మరోసారి వినోదం అందించిందని తన ట్విట్టర్లో వ్యంగంగా ట్వీట్ చేశాడు.