Riyan Parag: ఐపీఎల్ 2025లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఘటన చోటుచేసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని పరిగెత్తుకుంటూ వచ్చి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కాళ్లు మొక్కాడు. రియాన్ పరాగ్ 11వ ఓవర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్ కు కాసేపు అంతరాయం ఏర్పడింది. రియాన్ పరాగ్ బౌలింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. రియాన్ పరాగ్ కాళ్లపై పడి.. అనంతరం లేచి ఆలింగనం చేసుకున్నాడు. ఈ ఘటనపై నెట్టింట విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. రియాన్ పరాగ్ ఏం చేశాడని అభిమాని ఆయన కాళ్ల మీద పడ్డాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత రియాన్ పరాగ్ వేసిన బంతికి క్వింటన్ డికాక్ సిక్స్ బాదడం విశేషం.
రియాన్ పరాగ్ కాళ్లను అభిమాని మొక్కిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, కేఎల్ రాహుల్ లను అభిమానులు కౌగిలించుకుని పూజించిన ఘటనలు ఇంతకు ముందు ఎన్నో జరిగాయి. కానీ 23 ఏళ్ల ఆటగాడిని ఇంతగా అభిమానించడం ఎలా సాధ్యమని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏం చేశాడని రియాన్ పరాగ్ కాళ్లు మొక్కాడంటూ ప్రశ్నిస్తున్నారు.

దీనికి ప్రధాన కారణం అస్సాం రాష్ట్రంలో రియాన్ పరాగ్ ఒక స్టార్ ఆటగాడు. అస్సాం నుంచి జాతీయ స్థాయికి చేరుకున్న తొలి క్రికెటర్ రియాన్ పరాగ్. రియాన్ పరాగ్ చాలా కాలంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇటీవల భారత జట్టులో అవకాశం పొందాడు. రియాన్ పరాగ్ క్రికెట్ ఆడడం.. అస్సాం రాష్ట్రంలోని చాలా మందికి గొప్ప ప్రేరణగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే అభిమాని గ్రౌండ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చి పాదాలపై పడి నమస్కరించాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిని ఎగతాళి చేస్తున్నారు. ఇతర క్రికెటర్లకు ఇలాంటి అభిమానులు లేరని.. రియాన్ పరాగ్ జీవితం గొప్పదని చెబుతూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో రాజస్ఖాన్ రాయల్స్ ఓడిపోయింది. తొలి రెండు మ్యాచ్ లకు రియాన్ పరాగ్ కెప్టెన్ గా వ్యవహరించగా.. రాజస్థాన్ రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది.