హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి దేశమంతా అభిమానులు ఉన్నారు. ఇక ధోని స్వస్థలం రాంఛీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గురువారం రాంచీలోని బిర్సాముండా విమానాశ్రయంలో ఓ ఫ్యాన్ ధోని వాహనానికి అడ్డుపడి కాసేపు హల్ చల్ చేసింది.
బుధవారం వరకు కోల్కతాలో జార్ఖండ్ తరుపున దేశవాళీ టోర్నీలో ఆడిన ధోని జార్ఖండ్ జట్టుతో కలిసి విమానంలో మంగళవారం ఉదయం రాంచీకి తిరిగొచ్చాడు. రాంచీ విమానాశ్రయం బయట ధోని తన హమ్మర్ వాహనంలో ఇంటికి వెళుతుండగా సెల్ఫీ కోసం అతడి వాహనాన్ని ఆపేసింది.

ఇక్కడ విశేషం ఏమిటంటే ధోని ప్రయాణించిన విమానంలోనే ఆ యువతి ప్రయాణించింది. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే ధోనిని వెంబడించింది. హమ్మర్ వాహనంలో ధోని ఇంటికి వెళుతుండగా అతడి వాహనాన్ని అక్కడే అడ్డుకుంది. కానీ ధోని మాత్రం వాహనం నుంచి బయటకు రాలేదు.

వెంటనే అక్కడికి చేరుకున్న విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది ఆ యువతిని బలవంతంగా అక్కడి నుంచి పంపించివేశారు. అయితే ధోనిని ఓ అభిమాని వెంబడించడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ రాంచీలో ఓ అభిమాని ధోనీని ఇంటివరకు వెంబడించింది.

దీంతో ఆ అభిమాని విన్నపాన్ని మన్నించి ఆమెతో ధోని సెల్ఫీ దిగారు. అయితే ధోని హమ్మర్ వాహనం వార్తల్లోకి రావడం ఇదే మొట్టమొదటి సారి కాదు. గతేడాది న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. రాంచీలో వన్డే మ్యాచ్ సందర్భంగా అక్కడికి చేరుకున్న కివీస్ జట్టు ధోని తన హమ్మర్ వాహనంలో ఇంటికి వెళ్లడాన్ని టీమ్ బస్సులో నుంచి అలా చూస్తుండిపోయారు.