ఒకరిని ఎంచుకోవడం చాలా కష్టం:
మీకు ఎవరు అంటే బాగా ఇష్టం అని ఓ అభిమాని అడగ్గా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ అంటే తనకెంతో అభిమానమని కేదార్ జాదవ్ తెలిపాడు. ఇద్దరిలో ఒక్కరినే ఎంచుకోమనగా.. వారిద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకోవడం చాలా కష్టమని జాదవ్ అన్నాడు. సూపర్ స్టార్ పదాలను విడదీయలేం కదా.. ధోనీ, సల్మాన్ నాకు అంతే అని పేర్కొన్నాడు. 'ధోనీ వల్లే నేను ఎక్కువ వన్డేలు ఆడాను. సల్మాన్ను కూడా కలవగలిగాను. వారిద్దరిలో ఒక్కరినే ఎంచుకోమంటే.. అమ్మ, నాన్నలో ఒకరిని ఎంచుకో అన్నట్లే' అని కేదార్ చెప్పాడు. గట్టిగా అడిగితే ధోనీనే ఎంచుకుంటా అన్నాడు.
మహీ అండ లేకుంటే:
మిమ్మల్ని ధోనీ ఎప్పుడైనా తిట్టాడా అని ఓ అభిమాని ప్రశ్నించగా... సల్మాన్ సినిమాలోని ఓ ఫేమస్ డైలాగ్ చెప్పి కళ్లతోనే బయపెట్టేస్తాడు అని జాదవ్ తెలిపాడు. 'మహి బాయ్ని తొలిసారి కలిసినప్పుడు.. అతడు చాలా కఠినంగా ఉంటాడేమో అనిపించింది. కానీ.. అందుకు పూర్తి భిన్నంగా కనిపించాడు. ధోనీని కలిశాక అభిమాన క్రికెటర్గా అతడిని తప్ప మరెవరినీ చూడలేకపోయా. మహీ అండ లేకుంటే నేను ఇన్ని (73) వన్డేలు ఆడేవాడిని కాదు' అని చెప్పాడు.
ధోనీ మద్దతు ఇస్తాడు:
కేదార్ జాదవ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 2016, 2017లో ఆడాడు. ఆ తర్వాత 2018, 2019ల చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. రెండు జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం కెప్టెన్ అని జాదవ్ చెప్పాడు. ఎంఎస్ ధోనీ మద్దతు ఇస్తూ.. అవకాశాలను ఇస్తాడని పేర్కొన్నాడు. మనం మంచి ప్రదర్శన ఇచ్చినప్పుడు అతని ముఖం మీద చిరునవ్వు ఉంటుందన్నాడు. చెన్నై జట్టుకు అభిమానులు మద్దతు ఇచ్చే ఆమోఘం అని తెలిపాడు.
వైద్య సిబ్బందికి మాస్క్లు:
కొవిడ్-19పై పోరు సాగిస్తున్న వైద్య సిబ్బందికి ఉపయోగకరమైన మాస్క్లు అందించడంతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి కేదార్ జాదవ్ తన వంతు విరాళం అందజేశాడు. అయితే ఎంత మొత్తాన్ని విరాళంగా ప్రకటించిన విషయాన్ని మాత్రం జాదవ్ గోప్యంగా ఉంచాడు. విరాట్ కోహ్లీ కూడా ఎంత విరాళం ఇచ్చాడో చెప్పని విషయం తెలిసిందే. జాదవ్ భారత్ తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.