|
కుటుంబాన్ని లాగితే ఎలా?
మ్యాచ్ ఫలితాలకు సంబంధించిన వివాదాల్లో కుటుంబాన్ని లాగడం సరికాదని అన్నారు. మ్యాచ్ ఓడిపోవడం వల్ల దానికి పూర్తి బాధ్యతను వహిస్తున్నామని, ఇప్పటికీ ఓటమి భారం నుంచి తేరుకోలేకపోతున్నామని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ జట్టుకు అండగా ఉండాలని ఆయన పాకిస్తానీయులకు విజ్ఞప్తి చేస్తున్నారు. జట్టుకు నైతిక మద్దతు అందించాలని, మిగిలిన మ్యాచ్లల్లో పోరాడేలా ప్రోత్సహించాలని కోరారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఈ నెల 15వ తేదీ (భారత్తో మ్యాచ్కు ముందురోజు రాత్రి)కి సంబంధించినది కాదని అన్నారు. ఈ నెల 13వ తేదీన తాను భార్య సానియా, జట్టు సభ్యులతో కలిసి సరదాగా రెస్టారెంట్కు వెళ్లినప్పటిదని చెప్పారు.
|
20 ఏళ్లుగా జట్టుకు ఆడుతున్నా..
తాను 20 ఏళ్లుగా పాకిస్తాన్ జట్టు కోసం ఆడుతున్నానని, ఏనాడూ నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని షోయబ్ మాలిక్ చెప్పుకొచ్చారు. తాజాగా- తనపై వస్తోన్న విమర్శలకు సమాధానం ఇచ్చుకోవాల్సి రావడం అత్యంత బాధాకరమని అన్నారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు స్వదేశంపై ఉన్న అభిమానాన్ని మీడియా ద్వారా వివరించుకోవాల్సిన దుస్థితి ఎదురైందా? అని ప్రశ్నించారు. ఓ క్రికెటర్గా మాత్రమే కాకుండా.. క్రీడారంగంతో ముడిపడి ఉన్న ఆటగాళ్లందరి తరఫున తాను ప్రజలను ఒకటే కోరుతున్నానని, దయచేసి కుటుంబాన్ని వివాదాల్లోకి లాగవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
మా వాళ్లు తప్పు చేయలేదు: పీసీబీ
తమ జట్టు సభ్యులు ఎవరూ తప్పు చేయలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోపై తాము జట్టు సభ్యుల నుంచి వివరణ తీసుకున్నామని అన్నారు. దీనిపై విచారణ చేపట్టామని తెలిపారు. ఆ వీడియో భారత్తో మ్యాచ్కు ముందురోజు రాత్రి నాటిది కాదని తేలిందని పీసీబీ అధికారులు పేర్కొన్నారు. బోర్డు నియమ, నిబంధనలను ఉల్లంఘించి, అర్ధరాత్రి దాటిపోయేంత వరకూ రెస్టారెంట్లో విందు, వినోదాలతో కాలక్షేపం చేశారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపారు.