నామమాత్రపు లక్ష్యం..
రాజధాని ఢాకాలోని షేర్ ఎ బంగ్లా స్టేడియంలో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్స్లో మరోసారి పాకిస్తాన్ చేతిలో పరాభవాన్ని చవి చూసింది బంగ్లాదేశ్. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులే చేయగలిగింది. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్.. 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఈ విక్టరీతో మూడు మ్యాచ్ల ఈ సిరీస్ పాక్ వశమైంది.
పాకిస్తాన్ బౌలర్ల ధాటికి..
తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ ఏ దశలో కూడా పాకిస్తాన్ బౌలర్లను ఎదురునిలవలేకపోయింది. తొలి ఓవర్లోనే వికెట్ను కోల్పోయింది. పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షహెన్ షా అఫ్రిది సంధించిన ఆ ఓవర్ అయిదో బంతికి ఓపెనర్ సయీఫ్ హసన్ బలి అయ్యాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటికి బంగ్లాదేశ్ జట్టు స్కోరు ఒక్క పరుగే. రెండో ఓవర్ చివరి బంతికీ వికెట్ పడింది. మరో ఓపెనర్ మొహమ్మద్ నయీం ఫకర్ జమాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ వికెట్ మహ్మద్ వసీం ఖాతాలో చేరింది.
వీక్ బ్యాటింగ్..
వన్డౌన్ బ్యాటర్ నజ్ముల్ హొస్సెయిన్ శాంటో కొంత ఫర్వాలేదనిపించుకున్నాడు. 34 బంతుల్లో అయిదు ఫోొర్లతో 40 పరుగులు చేశాడు. అతనికి అఫీఫ్ హొస్సెన్ సహకారాన్ని అందించాడు. అఫీఫ్ 21 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్స్ ఉన్నాయి. జట్టు స్కోరు 51 పరుగుల వద్ద ఉన్నప్పుడు అఫీఫ్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్లోకి వచ్చిన బ్యాటర్లెవరూ నిలదొక్కుకోలేదు. వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. కేప్టెన్ మహ్మదుల్లా 12, నారుల్ హసన్ 11, మెహదీ హసన్ 3 పరుగులు చేశారు.
అఫ్రిది ఫామ్ కంటిన్యూ..
అమీనుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్ నాటౌట్గా నిలిచారు. పాకిస్తాన్ బౌలర్లలో షహెన్ షా అఫ్రిదీ తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. నాలుగు ఓవర్ల కోటాలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి, రెండు వికెట్లు పడగొట్టాడు. షాదాబ్ ఖాన్ రెండు, మహ్మద్ నవాజ్, హారిస్ రవూఫ్, మహ్మద్ వసీం ఒక్కో వికెట్ను తీసుకున్నారు. నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ పెద్దగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. వారిపై ఒత్తిడిని తీసుకుని రావడంలో బంగ్లా బౌలర్లు విఫలం అయ్యారు.
బాబర్ చీప్గా
108 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తొలి వికెట్ను త్వరగానే కోల్పోయింది. కేప్టెన్ బాబర్ ఆజమ్ ఒక పరుగుకే వెనుదిరిగాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత పాకిస్తాన్కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, వన్డౌన్ బ్యాటర్ ఫకర్ జమాన్ జట్టును విజయ తీరాలకు చేర్చారు. రిజ్వాన్ 45 బంతుల్లో నాలుగు ఫోర్లతో 39 పరుగులు చేశాడు. జట్టు విజయానికి చేరువైన సమయంలో అవుట్ అయ్యాడు.
ఫకర్ ఖాతాలో మరో అర్ధసెంచరీ..
జట్టు స్కోరు 97 పరుగుల వద్ద అమీనుల్ ఇస్లాం బౌలింగ్లో సయీఫ్ హసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. విజయం సాధించడానికి 11 పరుగులు మాత్రమే కావాల్సి రావడంతో పాకిస్తాన్ ఒత్తిడికి లోను కాలేదు. హైదర్ అలీతో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు ఫకర్ జమాన్. ఈ క్రమంలో అతను మరో అర్ధసెంచరీని సాధించాడు. 51 బంతుల్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 57 పరుగులు చేసి, నాటౌట్గా నిలిచాడు. తొలి టీ20లోనూ బంగ్లాదేశ్ ఓడిన విషయం తెలిసిందే.