

హైదరాబాద్: పాకిస్థాన్ సంచలన ఓపెనర్ ఫఖర్ జమాన్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఫఖర్.. జింబాబ్వేతో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా నాల్గో వన్డేలో డబుల్ సెంచరీ సాధించాడు. ఆ ఘనత సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్గా రికార్డు సృష్టించిన ఫఖర్ జమాన్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
ఆదివారం చివరిదైన ఐదో వన్డేలో ఫఖర్ జమాన్(85; 83 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో వన్డేల్లో వేగవంతంగా 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో వేగవంతంగా 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్మన్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్కు ముందు వెయ్యి పరుగుల ఘనతను చేరడానికి 20 పరుగుల దూరంలో ఉన్న ఫఖర్ దాన్ని సునాయాసంగా చేరుకున్నాడు.
దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, కేవిన్ పీటర్సన్, డికాక్ తదితరులు కెరీర్ ఆరంభంలో 21 ఇన్నింగ్స్లో ఈ వెయ్యి పరుగుల మార్క్ని అందుకోగా.. ఫకార్ జమాన్ కేవలం 18 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. పాకిస్థాన్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఏకైక బ్యాట్స్మెన్గా ఫకార్ జమాన్ ఇటీవల రికార్డుల్లో నిలిచాడు.
గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన ఫఖర్.. ఆ టోర్నీలో మొత్తంగా 252 పరుగులు చేశాడు. ఆ టోర్నీ ఫైనల్లో భారత్పై అతను సమయోచిత శతకం బాది టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో ఫఖర్ జమాన్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత.. వన్డే జట్టులో నమ్మదగిన ఆటగాడిగా కొనసాగుతున్న జమాన్.. తాజాగా జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్లోనూ పరుగుల మోత మోగిస్తున్నాడు. ఈ సిరీస్లో ఐదు వన్డేల్లో జమాన్ వరుసగా 60, 117 నాటౌట్, 43 నాటౌట్, 210 నాటౌట్, తాజాగా చివరి వన్డేలోనూ 85 పరుగులు చేశాడు.