IND vs PAK: ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్లోని 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారతదేశం అంతా ఆగ్రహంతో రగులుతోంది. పహల్గామ్లో జరిగిన ఈ ఉగ్రదాడికి పాకిస్థాన్ మద్ధతు ఉందని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రెండు దేశాల సైన్యాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఇంతలో పాకిస్థాన్ క్రికెటర్లు అన్ని పరిమితులను దాటుతూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. పహల్గామ్ దాడిలో పాకిస్థాన్ ప్రమేయానికి ఆధారాలు చూపించాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరో పాకిస్థాన్ క్రికెటర్ ఫహీమ్ అష్రఫ్ భారత్పై విషాన్ని వెళ్లగక్కాడు. ఫహీమ్ అష్రఫ్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీని పంచుకున్నాడు. పాకిస్థాన్ జెండాతో పాటు .. "పాకిస్థాన్ను నాశనం చేయగల శక్తి ఈ భూమిపై లేదు" అని రాసుకొచ్చాడు. ఈ పోస్టుపై ఫహీమ్ అష్రఫ్ ఇప్పుడు చాలా విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

సాజిద్ ఖాన్ కూడా..
ఫహీమ్ అష్రఫ్ మాత్రమే కాదు పాకిస్థాన్ క్రికెటర్ సాజిద్ ఖాన్ కూడా ఇలాంటి పోస్ట్ చేశాడు. సాజిద్ ఖాన్ మాజీ సైనికుడైన తన తండ్రి చిత్రాన్ని పోస్ట్ చేసి 'మీకు గుర్తు చేస్తున్నాను' అని రాసుకొచ్చాడు. ఈ పోస్టుపై భారతీయ నెటిజన్లు సాజిద్ ఖాన్కు తగిన సమాధానం ఇచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ క్రికెటర్లు భారత వ్యతిరేక పోస్టులు చేస్తున్నారు.
పహల్గాంలో మతం గురించి అడిగి మరి చంపేశారు..
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 26 మంది భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకం కోసం ఇక్కడికి వచ్చారు. తమ కుటుంబాలతో సెలవులు గడపడానికి పహల్గాంకు వచ్చిన ఈ పర్యాటకులపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఆ సమయంలో ఉగ్రవాదులు ప్రజలను వారి మతం గురించి అడిగారు. తర్వాత వారిని కాల్చి చంపారు. ఉగ్రవాదులు పర్యాటకులను రుజువుగా కల్మా పఠించమని కూడా కోరారు.