
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ను 13పరుగుల తేడాతో ఓడించడం ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వరుసగా మూడు మ్యాచ్ల ఓటములకు బ్రేక్ పడింది. ఆర్సీబీ కీలక టైంలో మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్ విజయంతో ఆ జట్టు ఓటముల పరంపరను అధిగమించడమే కాకుండా 11మ్యాచ్లలో ఆరు విజయాలతో 12పాయింట్లతో లీగ్ పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఆట తర్వాత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. బ్యాటింగ్ గ్రూప్గా జట్టు ఖచ్చితంగా సరైన దిశలో పయనిస్తోందని తెలిపాడు.
మ్యాచ్ అనంతరం డుప్లెసిస్ మాట్లాడుతూ.. 'మాకు ఈ విజయం ఖచ్చితంగా అవసరం. మేము స్కోరు బోర్డుపై మంచి స్కోరునే ఉంచగలిగాం. బ్యాటింగ్ యూనిట్ పరంగా సరైన ప్లాన్తో పయనిస్తున్నాం. బౌలింగ్ విభాగంలోనూ మేం చాలా పటిష్ఠంగా ఉన్నాం. ఈ పిచ్ మీద 165 పరుగులు చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను.. తద్వారా ఆ స్కోరును డిఫెండ్ చేసుకోవడానికి ఎడ్జ్ ఉంటుంది. ఇక మా బ్యాటర్లు నేను అనుకున్న దాన్ని రీచ్ అయ్యారు. ఇక ఛేజింగ్లో మా బౌలింగ్ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. అనుభవజ్ఞులైన యువ బౌలర్లను కలిగి ఉండటం జట్టు అదృష్టంగా భావిస్తున్నా. ఫీల్డింగ్ పరంగానూ మా టీం చాలా మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్లో మా ప్లేయర్లు కొన్ని మంచి క్యాచ్లు అందుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో ఇంకా మెరుగవ్వాల్సింది కొంత ఉంది. టాప్ నలుగురిలో ఒకరు భారీ స్కోరుతో బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా. ' అని ఫాఫ్ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్లో డుప్లెసిస్ బ్యాటింగ్లో ఆర్సీబీకి శుభారంభం దక్కే ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీతో ఓపెనింగ్కు దిగిన ఫాఫ్ 22బంతుల్లో 38పరుగులు చేసి పవర్ ప్లేలో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు కోహ్లీ తడబడుతుంటే చెన్నై బౌలర్లను ఫాఫ్ సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఇక ఫాఫ్ ఔటయ్యాక ఆర్సీబీ ఇన్నింగ్స్ గాడి తప్పింది. మిడిల్ ఓవర్లలో మూడు ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే చివర్లో మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ రాణించడంతో ఆర్సీబీ 173పరుగుల స్కోరు చేసింది. ఇక ఛేజింగ్లో చెన్నైను 160 పరుగులకే ఆర్సీబీ పరిమితం చేయగలిగింది. ఇక ఈ సీజన్లో 7వ ఓటమి మూటగట్టుకున్న చెన్నై పాయింట్ల పట్టికలో ఎప్పటిలాగే 9వస్థానంలో పాతుకుపోగా.. ఆర్సీబీ 4వ స్థానంలోకి వెళ్లింది.