
దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాటర్ ఫాఫ్ డుప్లిసెస్ను రాయల చాలెంజర్స్ బెంగళూరు జట్టు రాబోయే ఐపీఎల్ సీజన్కు తమ కెప్టెన్గా ప్రకటించింది. 2013 నుంచి జట్టుకు నాయకత్వం వహించిన విరాట్ కోహ్లీ ఈ సారి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో ఎన్నో చర్చల నడుమ కెప్టెన్సీ బాధ్యతలను 37 ఏళ్ల డుప్లిసెస్కు అప్పగించారు. అయితే ఐపీఎల్లో గత సీజన్లలో డుప్లిసెస్ చెన్నైసూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. దీంతో ఆ జట్టుతో తన అనుబంధాన్ని, ముఖ్యంగా కెప్టెన్ ధోని గురించి ఆసక్తిర విషయాలు వెల్లడించాడు. తాను చెన్నైసూపర్ కింగ్స్కు మొదటి సారి ఆడినప్పుడు ధోని గురించి చాలా ఊహించుకున్నానని, అలా చేయాలి, ఇలా ఉండాలని హెడ్ మాస్టర్లా రూల్స్ పెడతాడని భావించానని, కానీ అలా జరగలేదని డుప్లిసెస్ చెప్పాడు.
తాను సౌతాఫ్రికా ప్లేయర్ను కావడం వల్ల అలా అనుకున్నానెమోనని, కానీ ఇక్కడి వాతావరణం డిఫరెంట్ అని చెప్పాడు. ఇలా చేయ్, అలా చేయ్ అంటూ తన టీమ్మెంబర్స్కు ధోని ఎలాంటి సలహాలు ఇవ్వడని చెప్పాడు. ప్రతి ఒక్క ఆటగాడికి ప్రత్యేకంగా ఒక స్టైల్ ఉండడం ముఖ్యమని, ఎందుకంటే తాను విరాట్ కోహ్లీలా బ్యాటింగ్ చేయలేనని, అలాగే ఎంఎస్ ధోనిలా ఉండలేనని డుప్లిసెస్ చెప్పాడు. నేనేంటో తెలుసుకుని, నాలా నేను ఉంటే చాలని, ఒత్తిడిని తట్టుకోవడానికి తనకు అదే మనో ధైర్యాన్ని ఇస్తుందని డుప్లిసెస్ అభిప్రాయడ్డాడు. చెన్నైసూపర్ కింగ్స్తో తన ప్రయాణం గొప్పగా సాగిందని, కెప్టెన్గా ఉన్నతంగా ఆలోచించడానికి సీఎస్కేతో ఆడిన అనుభవం ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్లో ఇప్పటివరకు 100 మ్యాచ్లు ఆడిన 37 ఏళ్ల ఫాఫ్ డుప్లిసెస్ 34 సగటుతో 2935 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 96 పరుగులుగా ఉంది. ఇక గత సీజన్లో అయితే టాప్ ఫామ్లో ఉన్నాడు. ఆ సీజన్లో ఏకంగా 633 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అతని కంటే ముందు ఉన్న ఆటగాడికి 2 పరుగులే ఎక్కువగా ఉన్నాయి.