సౌతాఫ్రికా టీ20 లీగ్లో ముంబయి ఇండియన్స్ కేప్టౌన్పై (ఎంఐ కేప్టౌన్) జోబర్గ్ సూపర్ కింగ్స్ సంచలన విజయాన్ని నమోదుచేసింది. వర్షం కారణంగా ఎనిమిది ఓవర్ల పాటు కుదించిన ఈ మ్యాచ్లో సూపర్ కింగ్స్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు ల్యూస్ డుప్లూయ్ (41*; 14 బంతుల్లో), ఫాప్ డుప్లెసిస్ (50*; 20 బంతుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేప్టౌన్కు మంచి ఆరంభమే దక్కింది. పవర్ప్లేలో ఒక్క వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. చాలాసేపు తర్వాత వరుణుడి కరుణించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్ను ఎనిమిది ఓవర్లకు కుదించారు. అనంతరం చివరి రెండు ఓవర్లలో కేప్ టౌన్ ఏకంగా 37 పరుగులు సాధించింది.

కెప్టెన్ పొలార్డ్ అజేయంగా 10 బంతుల్లో 33 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు బాదాడు. ఓపెనర్ రెకెల్టన్ (23; 16 బంతుల్లో) తన ఫామ్ను కొనసాగిస్తూ మరోసారి రాణించాడు. లివింగ్స్టోన్ (3; 4 బంతుల్లో) విఫలమయ్యాడు. వాండర్ డసెన్ (16; 18 బంతుల్లో) నిరాశపరిచాడు. సూపర్ కింగ్స్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ రెండు వికెట్లు సాధించాడు.
అయితే డక్వర్త్ లూయిస్ పద్ధతిలో జోబర్స్ సూపర్ కింగ్స్కు 8 ఓవర్లలో 98 పరుగుల లక్ష్యంగా అంపైర్లు నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 5.4 ఓవరల్లోనూ సూపర్ కింగ్స్ ఛేదించింది. మెరుపు ఆరంభంతో కింగ్స్ ఛేజింగ్ను మొదలుపెట్టింది. తుషార వేసిన తొలి ఓవర్ మొదటి రెండు బంతుల్ని డుప్లూయ్ సిక్సర్లగా మలిచాడు. మరో బౌండరీ సాధించడంతో మొదటి ఓవర్లోనే 18 పరుగులు వచ్చాయి.
అనంతరం డుప్లెసిస్ కూడా చెలరేగడంతో మూడు ఓవర్లలోనే సూపర్ కింగ్స్ 57 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఓపెనర్లు అదే జోరును ప్రదర్శిస్తూ టార్గెట్ను అందుకున్నారు. ఈ సంచలన విజయంతో జోబర్గ్ సూపర్ కింగ్స్కు బోనస్ పాయింట్ కూడా లభించింది. డుప్లూయ్ రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదగా, కెప్టెన్ డుప్లెసిస్ నాలుగు బౌండరీలు, మూడు సిక్సర్లు సాధించాడు.