సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంతర్జాతీయ క్రికెట్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు దక్షిణాఫ్రికా జట్టు వైట్ బాల్ కోచ్ రాబ్ వాల్టర్ తో చర్చిస్తున్నట్లు డుప్లెసిస్ తెలిపాడు. 2021లో టెస్టుల నుంచి వీడ్కోలు పలికిన అతడు టీ20లకు రిటైర్మెంట్ ఇవ్వలేదు. 2020లో దక్షిణాఫ్రికా తరపున టీ20 మ్యాచ్ చివరిసారిగా ఆడాడు.
అయితే తమ జట్టుకు టీ20 ప్రపంచకప్ అందివ్వడానికి తిరిగి అంతర్జాతీయ క్రికెట్ లో పునరాగమం చేస్తున్నాని డుప్లెసిస్ వెల్లడించాడు. ''ఇంటర్నేషనల్ క్రికెట్ కు రీఎంట్రీ ఇస్తాను. గత రెండేళ్లుగా దీని గురించే ఆలోచిస్తున్నా. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం జట్టును సమతూకంగా చేసేందుకు ప్రయత్నిస్తా. ఈ విషయంపై కోచ్ తో కూడా మాట్లాడాను'' అని డుప్లెసిస్ తెలిపాడు.

39 ఏళ్ల డుప్లెసిస్ 2014, 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఆడాడు. ఆ తర్వాత జరిగిన పొట్టి కప్ లకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే ఐపీఎల్ లో డుప్లెసిస్ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. ఆర్సీబీ తరపున డుప్లెసిస్ 2023 సీజన్ లో సెకండ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 14 మ్యాచ్ ల్లో 730 పరుగులు చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు దూరమైనా లీగ్ మ్యాచ్ ల్లో రాణిస్తూ ఫామ్ ను కాపాడుకుంటున్నాడు.
డుప్లెసిస్ రీఎంట్రీ గురించి దక్షిణాఫ్రికా వైట్ బాల్ కోచ్ రాబ్ వాల్టర్ స్పందించాడు. డుప్లెసిస్ తో పాటు సీనియర్ ప్లేయర్లు క్వింటన్ డికాక్, రొసొవ్ ను కూడా టీ20 ప్రపంచకప్ జట్టులోకి పరిగణనలోకి తీసుకుంటామని తెలిపాడు. అంతేగాక SA20లో రాణించే ఆటగాళ్లను ప్రపంచకప్ జట్టులో 80% ఉండేలా ట్రై చేస్తున్నామని వివరించాడు.
అయితే డుప్లెసిస్ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్న విధంగానే ఏబీ డివిలియర్స్ కూడా పునరాగమనం చేస్తే దక్షిణాఫ్రికా మరింత స్ట్రాంగ్ గా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది జూన్ లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.