
చివరి ఓవర్లో 16 పరుగులు:
ముంబై ఇండియన్స్ విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం అయ్యాయి. చెన్నై పేసర్ లుంగి ఎంగిడి బౌలింగ్ చేశాడు. మొదటి బంతికి పరుగేమీ రాలేదు. రెండు, మూడో బంతికి కీరన్ పొలార్డ్ ఫోర్లు బాదాడు. నాలుగో బంతికి సింగల్ వచ్చే అవకాశం ఉన్నా.. పొలార్డ్ నిరాకరించాడు. ఇదో బంతికి సిక్స్ బాదిన విండీస్ హిట్టర్.. చివరి బంతికి డబుల్ తీసి ముంబైకి ఊహించని విజయాన్ని అందించాడు. దీంతో ఐపీఎల్లో రెండో విజయవంతమైన భారీ ఛేదనగా ఈ మ్యాచ్ నిలిచింది. గతేడాది సీజన్లో కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 224 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇది అతి పెద్ద ఛేదన.
డుప్లెసిస్ తప్పిదం:
అయితే కీరన్ పొలార్డ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లోనే ఔట్ అవ్వాల్సింది. ముంబై విజయానికి చివరి మూడు ఓవర్లలో 48 రన్స్ అవసరం అయ్యాయి. 18వ ఓవర్ వేసిన శార్ధూల్ ఠాకూర్ భారీగా పరుగులు ఇచ్చాడు. మొదటి బంతికి కృనాల్ సింగల్ తీయగా.. ఆ తర్వాత వైడ్ వేశాడు. రెండో బంతికి సిక్స్, మూడో బంతిని బౌండరీ బాదిన పొలార్డ్.. నాలుగో బంతికి 2 పరుగులు చేశాడు. షార్ట్ పిచ్ రూపంలో ఐదవ బంతిని విసరగా.. లాంగాన్ దిశగా పొలార్డ్ సిక్స్ కోసం షాట్ ఆడాడు. ఎక్కువ ఎత్తులో వెళ్లిన బంతి బౌండరీ లైన్కి సమీపంలో ఉన్న ఫాఫ్ డుప్లెసిస్ చేతికి చిక్కింది. కానీ బంతిని డుప్లెసిస్ సరిగ్గా పట్టుకోలేకపోయాడు. అతని చేతి నుంచి బౌన్స్ అయిన బంతి నేలపాలైంది. ఇంకేముందు పొలార్డ్ బతికిపోయాడు.

జీవనాధారంతో మరింత రెచ్చిపోయాడు:
18వ ఓవర్లో ఫాఫ్ డుప్లెసిస్ ఇచ్చిన జీవనాధారంతో కీరన్ పొలార్డ్ మరింత రెచ్చిపోయాడు. 19వ ఓవర్లో రెండు బంతులు ఆడి మూడు రన్స్ చేసిన అతడు.. 20వ ఓవర్ మొత్తం ఆడి 16 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఒకవేళ పొలార్డ్ 18వ ఓవర్లో ఔటై ఉంటే.. మ్యాచును కచ్చితంగా చెన్నై గెలిచేదే. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఒకే ఒక్క క్యాచ్ చెన్నై కొంప ముంచింది. క్యాచులే మ్యాచును ముంచుతాయని స్పష్టంగా తెలిసింది. ఇక కీలక క్యాచ్ వదిలేసి చెన్నై ఓటమికి కారణం అయిన ఫాఫ్ డుప్లెసిస్పై ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

జడేజా, అలీ చేతికి బంతిని ఇస్తే:
లుంగి ఎంగిడి, శార్ధూల్ ఠాకూర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఎంగిడి 62, శార్ధూల్ 56 రన్స్ ఇచ్చారు. రవీంద్ర జడేజా తన మూడు ఓవర్లలో ఒక వికెట్ తీసి 29 రన్స్ ఇచ్చాడు, ఇక మొయిన్ అలీ ఒక వేసి ఒక పరుగు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అప్పటికే పరుగులు ఇస్తున్న ఎంగిడి, శార్ధూల్ బదులు.. జడేజా, అలీ చేతికి బంతిని ఇస్తే ఫలితం మరోలా ఉండేది. ఈ ఇద్దరిలో ఒకరితోనైనా ఒక ఓవర్ వేపించి ఉంటే బాగుండేది. ఎంతో అనుభవం ఉన్న చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ పెద్ద తప్పిదమే చేశాడు. ఇది కూడా చెన్నై ఓటమి ఓ కారణం.


Click it and Unblock the Notifications












