సౌతాఫ్రికా మాజీ లెజెండ్, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆడుతున్న అతను జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టుకు సారధ్య బాధ్యతలు వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో అద్భుత ఫామ్లో ఉన్న డుప్లెసిస్.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా సన్రైజర్స్ జట్టును కూడా అతను ఓడించాడు.
వాండరర్స్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో జోబర్గ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో రీజా హెండ్రిక్స్ (40)తో కలిసి ఓపెనింగ్ చేసిన డుప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 61 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అయితే వీళ్లిద్దరూ తప్ప మిగతా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత వచ్చిన వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జోబర్గ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఛేజింగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీంకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఆడమ్ రాసింగ్టన్ (1) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ టెంబా బవుమా (50) రాణించాడు. కానీ అతనికి ఎవరూ సహకారం అందించలేకపోయారు. మధ్యలో కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (34), బ్రైడన్ కార్సే (11), వాన్ డర్ మెర్వ్ (16 నాటౌట్) కొంత పోరాడినా మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు.
దీంతో సన్రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. జోబర్గ్ బౌలర్లలో కైల్ సిమండ్స్ మూడు వికెట్లతో చెలరేగగా.. మహీష్ తీక్షణ, రొమేరియో షెఫర్డ్, గెరాల్గ్ కోట్జీ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. దీంతో సన్రైజర్స్కు ఓటమి తప్పలేదు. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.