ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల కోసం ప్రఖ్యాత కార్పోరేట్ సంస్ధలు పోటీ పడుతున్నాయి. ఈ స్పందన పట్ల బీసీసీఐ ఉబ్బితబ్బిబ్బవుతోంది. తాజాగా మీడియా హక్కుల కొనుగోలు జాబితాలో సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజాలు ఫేస్బుక్, ట్విట్టర్ కూడా చేరాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సారి ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్తో పాటు జిటల్, మొబైల్ రైట్స్కు కలిపి బీసీసీఐ ఒకే బిడ్డింగ్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ టెలివిజిన్ హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) 2017 ఐపీఎల్ సీజన్ వరకు కలిగి ఉంది. దీంతో 2018 ఏడాదితో మొదలు పెట్టి ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను పదేళ్ల కోసం, డిజిటల్, మొబైల్ హక్కులను ఐదేళ్ల కాలానికి ఇవ్వనున్నారు.
ఈ మీడియా హక్కుల కోసం ఆహ్వాన టెండర్ (ఐటీటీ)ను ఫేస్బుక్, ట్విటర్ సహా 18 సంస్థలు కొనుగోలు చేశాయని బోర్డు ప్రకటించింది. 'భారత క్రికెట్లో ఇది చారిత్రాత్మక క్షణం. ప్రముఖ సంస్థలు హక్కుల కోసం ఆసక్తి చూపించడం ఐపీఎల్ గొప్పతనాన్ని, దానిపై వారి నమ్మకాన్ని సూచిస్తోంది' అని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.

సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 18 వరకూ ఐటీటీ డాక్యుమెంట్ విక్రయాలు జరిపామని తెలిపారు. అక్టోబర్ 25న ఎంపికైన బిడ్డర్ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. టీవీ ప్రసారం కోసం సోనీ, స్టార్ గ్రూప్ల మధ్య భారీ పోటీ నెలకొని ఉంది. కాగా, ఇతర హక్కుల కోసం ట్విట్టర్, ఫేస్బుక్తో పాటు అమెజాన్, రిలయన్స్ జియో, టైమ్స్ ఇంటర్నెట్, గల్ఫ్ డీటీహెచ్, ఈఎస్పీఎన్, జీ తదితర కంపెనీలు పోటీ పడుతున్నాయి
మీడియా హక్కుల ధర 4.5 బిలియన్ డాలర్ల (రూ. 30 వేల కోట్లు) వరకూ పలుకుతుందని బీసీసీఐ అంచనా వేసింది. భారత ఉపఖండంలో ఐపీఎల్ టెలివిజన్ హక్కులను ఎందుకు పదేళ్ల కాలానికి ఇచ్చామో బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రీ వెల్లడించారు. కాగా ఐపీఎల్-2018 బిడ్డింగ్ ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బిడ్డింగ్లో మార్పులు ఎవరికి లాభం?
ఈసారి ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ బిడ్డింగ్లో పాల్గొనే వారందరికీ సమాన అవకాశాలు లభించే అవకాశం లేదు. గతంలో భారతలో ఐపీఎల్ ప్రసార హక్కులు, డిజిటల్ బ్రాడ్కాస్ట్ ఇన్ ఇండియా.. అంతర్జాతీయంగా టీవీ, డిజిటల్ ప్రసార హక్కులను విడివిడిగా ఇచ్చే వారు. కానీ ఇప్పుడు మూడింటినీ గుత్తగా ఒక్కరికే కట్టబెడుతున్నారు.
ఈ మార్పు వల్ల స్టార్, సోనీ లాంటి వారికి లాభం చేకూరుస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బిడ్డింగ్ వల్ల ఒకటి దక్కించుకుంటే.. మిగతావి ఉచితం అన్నట్టుగా బీసీసీఐ విధానం ఉందనే విమర్శలూ వస్తున్నాయి.