భారతదేశ పర్యాటక రంగం గురించి తక్కువగా చేసిన మాట్లాడిన మాల్దీవులు ఎంపీ జహీద్ రమీజ్పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పరోక్షంగా మాల్దీవులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కూడా 'మాల్దీవులు వివాదం'పై స్పందించాడు.
అసలేం జరిగిందంటే.. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్లో పర్యటించిన విషయం తెలిసిందే. సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సముద్రం తీరాన కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ''లక్షద్వీప్ సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయా. అక్కడి ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పర్యాటకులు లక్షద్వీప్ను కూడా వీక్షించండి'' అని మోడీ ట్వీట్ చేశారు.

దీంతో తమ పర్యాటర రంగానికి ప్రభావం చూపిస్తుందని భావించిన మాల్దీవులు ఎంపీ జహీద్ భారత్పై అక్కసు వెళ్లగక్కాడు. పర్యాటకంలో తమ దేశంతో భారత్ పోటీ పడలేదని నోరు జారాడు. మాల్దీవులు అందించే సర్వీస్, పరిశుభ్రత అందించలేరని, ఇండియా గదుల్లో దుర్వాసన వస్తుందని అతిగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో మాల్దీవులను బహిష్కరించాలని, దేశంలోని ఐల్యాండ్స్లో పర్యటించాలని నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు.
తాజాగా హార్దిక్ కూడా ట్వీట్ చేశాడు. ''భారతదేశం గురించి తక్కువగా మాట్లాడిన విషయం తెలిసి చాలా బాధపడ్డా. అందమైన సముద్రం, సుందరమైన తీర ప్రాంతం కలిగిన లక్షదీవులు చూడాల్సిన గొప్ప ప్రదేశం. వచ్చే సెలవుల్లో నేను తప్పక వెళ్తాను'' అని హార్దిక్ రాసుకొచ్చాడు. కాగా, ప్రపంచకప్లో గాయంతో జట్టుకు దూరమైన హార్దిక్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్తో జరిగే సిరీస్లకు దూరం కానున్నట్లు సమాచారం. అయితే ఐపీఎల్ సమయానికి పూర్తిగా కోలుకుంటాడని తెలుస్తోంది. ఇటీవల ముంబయి ఇండియన్స్ హార్దిక్ను కెప్టెన్గా నియమించిన సంగతి తెలిసిందే.
కాగా, మాల్దీవుల్లో గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరున్న ముయిజు అధ్యక్ష పీఠమెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తమ దేశంలో మోహరించిన భారత బలగాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవులు కోరింది. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక బంధానికి బలమైన 'ఇండియాకు తొలిప్రాధాన్యం' విధానాన్ని కూడా మారుస్తామని ప్రకటించింది.