అడిలైడ్: సూపర్ మార్కెట్ పద్ధతిలో అనుభవానికి పెద్ద పీట వేయడం క్రికెట్ జట్టులో కుదరదని టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి అన్నారు. త్వరలో భారత్లో జరిగే ట్వంటీ20 ప్రపంచ కప్కు సీనియర్ ఆటగాళ్లైన యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రాలను ఎంపిక చేస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగితే రవిశాస్త్రి వ్యంగ్యంగా ఆ విధంగా అన్నారు.
సూపర్ మార్కెట్లో మాదిరిగా అనుభవాన్ని కొనుగోలు చేయడం కుదరదని ఆయన అన్నారు. ఆ సమయానికి వారు సరైన ఫిట్నెస్తో ఉంటే తప్పకుండా జట్టులో ఉంటారని చెప్పారు. ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ సన్నాహకంలో భాగంగా మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో మూడు ట్వంటీ20 మ్యాచుల సిరీస్కు టీమిండియా సన్నద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు రవిశాస్త్రి స్పందించారు. యువరాజ్ సింగ్ను ఆయన ప్రశంసించారు. పరిమిత ఓవర్ల మ్యాచుల్లో అనుభజ్ఞుడైన యువరాజ్ సింగ్ తప్పకుండా ఆటగాళ్లపై ప్రభావం చూపుతాడని ఆయన అన్నారు. రికార్డులే యువరాజ్ సింగ్ ప్రతిభను చెబుతాయని ఆయన అన్నారు.
యువరాజ్ సింగ్ ట్వంటీ20లో విధ్వంసకరమైన ఆటగాడని, అతని రికార్డులు అద్భుతంగా ఉన్నాయని, మ్యాచ్ విన్నర్ అని ఆయన అన్నారు. వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ చేతిలో దెబ్బ తిన్న యువ భారత బౌలర్లకు ఆశిష్ నెహ్రా వంటి అనుభవజ్ఢుడైన బౌలర్ సలహాలు ఉపయోగపడుతాయని ఆయన అన్నారు.