PAK vs SL: మంగళవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఓ కోర్టు బయట బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా.. 27 మంది గాయపడ్డారు. ప్రస్తుతం శ్రీలంక జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉంది. రెండు జట్లు మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ మ్యాచ్లు రావల్పిండిలో జరుగుతున్నాయి. ఇస్లామాబాద్, రావల్పిండిలను 'ట్విన్ సిటీస్' (కవల నగరాలు) అని కూడా పిలుస్తారు. అందుకే శ్రీలంక ప్లేయర్లు భయాందోళన చెందుతున్నారు. దాదాపు 9 మంది ఆటగాళ్లు పాకిస్తాన్ పర్యటనను మధ్యలోనే వదిలి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నారు.
బోర్డు నుంచి ఆటగాళ్లకు బెదిరింపు
బాంబు పేలుడు ఘటన తర్వాత భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ పర్యటనను కొనసాగించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు జట్టుకు ఆదేశించింది. ఒకవేళ ఆటగాళ్లు త్వరగా తిరిగి వెళ్లిపోతే.. వారి పర్యటనపై 'లాంఛనప్రాయ సమీక్ష' ఉంటుందని బోర్డు వారిని హెచ్చరించింది. అంతేకాకుండా ఆటగాళ్లు బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, సిరీస్లో పాల్గొనేందుకు వారి స్థానంలో కొత్త ఆటగాళ్లను పంపుతామని క్రికెట్ బోర్డు హెచ్చరించింది.

రెండో,మూడో మ్యాచ్ల తేదీలు మార్పు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రెండో, మూడో వన్డే మ్యాచ్ల షెడ్యూల్ను మార్చింది. ఇప్పుడు రెండో మ్యాచ్ గురువారం బదులు శుక్రవారం నాడు.. మూడో మ్యాచ్ శనివారానికి బదులు ఆదివారం నాడు రావల్పిండిలో జరుగుతాయి. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోషల్ మీడియాలో శ్రీలంక జట్టును ప్రశంసిస్తూ.. "పర్యటనను కొనసాగించాలనే వారి నిర్ణయానికి నేను కృతజ్ఞుడను. క్రీడా స్ఫూర్తి, సంఘీభావం ప్రకాశిస్తున్నాయి." అని పేర్కొన్నారు.
2009లో శ్రీలంక జట్టుపై దాడి
2009లో పాకిస్తాన్లో శ్రీలంక క్రికెట్ జట్టు బస్సుపై ఉగ్రదాడి జరిగింది. లాహోర్లోని గడాఫీ స్టేడియానికి వెళ్తున్న శ్రీలంక జట్టు బస్సుపై తుపాకులతో దాడి చేయగా.. ఆరుగురు శ్రీలంక ఆటగాళ్లు గాయపడ్డారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్లో అంతర్జాతీయ క్రికెట్ చాలా కాలం పాటు నిలిచిపోయింది. పాకిస్తాన్ 2011 ప్రపంచ కప్కు సహ-ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఆ అవకాశం కోల్పోయింది. అప్పటి నుంచి భారత్ అయితే పాకిస్తాన్లో పర్యటించలేదు.