కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు వరుస వన్డేలలో భారత్ ఓడిపోయింది. బుధవారం జరిగిన నాలుగో వన్డేను భారత్ చేజేతులారా జారవిడుచుకుంది. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రవీంద్ర జడెజా పైన విమర్శలు వస్తున్నాయి.
జడెజా తీరును భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ కూడా తప్పుబట్టాడు. జడేజా సహచర బ్యాట్స్మెన్తో సరిగా సమన్వయం చేసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. జడెజా అనుభవం కలిగిన ఆటగాడని, అతను టెయిలెండర్లతో సమన్వయం చేసుకోవాల్సి ఉండెనని చెప్పాడు.
349 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 277 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. అప్పటికీ 37.2 ఓవర్లే పూర్తయ్యాయి. దీంతో నాలుగో వన్డేను భారత్ కచ్చితంగా గెలుస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత 277 నుంచి 323 పరుగులు మధ్యనే భారత్ మిగతా 9 వికెట్లు కోల్పోయింది.

అంటే 46 పరుగుల వ్యవధిలోనే అన్ని వికెట్లు కోల్పోయింది. జడెజా ఇతర బ్యాట్సుమెన్తో సమన్వయం చేసుకోలేదనే విమర్శలు వచ్చాయి. ధోనీ కూడా అదే చెప్పాడు. లోయర్ ఆర్డర్ బ్యాట్సుమెన్లలో జడెజా అనుభవం కలిగిన వాడని, ఒత్తిడి సమయంలో అతను సమన్వయం చేసుకోవాల్సి ఉండెనన్నాడు.
కాగా, భారత్ వరుస వికెట్లతో ఓటమి దిశగా సాగుతున్న స్థితిలో జడేజా బ్యాటింగ్ చేసిన తీరు విమర్శలకు దారి తీసింది. టెయిలెండర్లను కాపాడుకుంటూ పోరాటంతో జట్టును గెలిపించుకునే ప్రయత్నం చేసే బదులు అజేయంగా ఉంటే చాలనుకున్నట్లు ఆడాడు.
6వ స్థానంలో, 40వ ఓవర్లో భారత్కు మరో 71 పరుగులు అవసరం ఉండగా జడేజా బరిలోకి దిగాడు. షాట్లు కొట్టలేదు. స్ట్రైక్ రొటేట్ చేయడానికి ప్రయత్నించలేదు. జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాలనే ఉద్దేశమే ఉన్నట్లు కనిపించలేదు. ఉమేశ్ను ఎక్కువగా స్ట్రైక్ చేయనిచ్చిన జడేజా ఏ దశలోనూ బాధ్యత తీసుకున్నట్లు కనిపించలేదు. చివరికి 27 బంతుల్లో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు.