

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మరొకసారి మద్దతుగా నిలిచాడు హెడ్ కోచ్ రవిశాస్త్రి. ధోని అనుభవం మార్కెట్లో దొరికే వస్తువు కాదని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు.
ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్గా, ఒక వికెట్ కీపర్గా ఎంతో అనుభవం ఉన్న ధోనిలో ఇంకా అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని కొనియాడాడు. 'నేను చెప్పినట్లుగా... ధోని అనుభవానికి ఎలాంటి ప్రత్యామ్నాయం ఉండదు. దానిని మార్కెట్లో అమ్మలేం.. కొనలేం' అని రవిశాస్త్రి అన్నాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోని గ్రేటెస్ట్ ఆటగాడని కితాబిచ్చాడు. 'క్రికెట్ వరల్డ్కు దొరికిన ఒక గ్రేటెస్ట్ వన్డే ఆటగాడు ధోని. అంతేకాదు.. అరుదైన ఆటగాడు కూడా, అంతటి అనుభవం కూడా ఉంది. ప్రస్తుతం ధోనిని ఫిట్నెస్ పరంగా చూస్తే ఎంతో ముందంజలో ఉన్నాడు' అని పేర్కొన్నాడు.
ముఖ్యంగా డెత్ ఓవర్లలో మ్యాచ్ను ముగించి మంచి మ్యాచ్ ఫినిషర్గా ధోని అరుదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ధోనిలా మ్యాచ్ను ఫినిష్ చేసే ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్లో చాలా తక్కువ మందే అని చెప్పాలి. 'డెత్ ఓవర్లలో గేమ్ను ఫినిషింగ్ చేసే ఆటగాళ్లు చాలా అరుదు. ప్రపంచ క్రికెట్లో ఇలా తక్కువ మంది ఉన్నారు' అని శాస్త్రి తెలిపాడు.
'సాధారణంగా 5,6,7 స్థానాల్లో బ్యాటింగ్ దిగే ధోని ఆ స్థానాల్లో తన మార్కును చూపెడుతున్నాడు. అతని అనుభవానికి ప్రత్యామ్నాయం ఉండదు. అతని అనుభవం భారత జట్టుకు చాలా విలువైనది. అది మార్కెట్లో దొరికే వస్తువు ఎంత మాత్రం కాదు' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.