
వచ్చే సీజన్ కోసం ప్రణాళికలు:
చైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధ్యక్షతన మంగళవారం ముంబైలో సమావేశమైన ఐపీఎల్ పాలనా కమిటీ (సీజీ) వచ్చే ఏడాది జరుగనున్న సీజన్ కోసం ప్రణాళికలు, విదేశీ ఆటగాళ్ల అందుబాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ సమావేశంలో సీజన్-13ను సరికొత్తగా తీసుకురావాలని చర్చలు చేశారట. అంతేకాదు ఐపీఎల్లో పొరపాట్లకు అవకాశమే ఇవ్వకుండా నిర్వహించాలని సీజీ భావిస్తోందట.

నోబాల్స్ విషయంలో విమర్శలు:
గత ఐపీఎల్ సీజన్లో అంపైరింగ్ తప్పిదాలు వార్తల్లో నిలిచాయి. అనుభవ అంపైర్లు క్రీజులో ఉన్నా కూడా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు వచ్చాయి. ముఖ్యంగా నోబాల్స్ విషయంలో విమర్శలు ఎక్కువగా వినిపించాయి. బెంగళూరుతో మ్యాచ్లో ముంబై పేసర్ లసిత్ మలింగ ఇన్నింగ్స్ ఆఖరి బంతిని నోబాల్గా వేసినా.. అంపైర్ తప్పుడు నిర్ణయానికి మ్యాచ్ ఓడాల్సి వచ్చింది. దీనిపై అప్పట్లోనే విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు.

ప్రత్యేక అంపైర్:
ఐపీఎల్లో గత ఏడాది తప్పుడు నిర్ణయాలకు చెక్ పెట్టేందుకు బీసీసీఐ మరో అడుగు ముందుకేసింది. ఐపీఎల్లో జరిగే ప్రతీ మ్యాచ్లోనూ ఇకనుంచి నోబాల్స్ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అంపైర్లను రంగంలోకి దించనుంది. అయితే దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రయోగాత్మకంగా ముస్తాక్ అలీ ట్రోఫీలో పరిశీలించాలని బీసీసీఐ భావిస్తోంది.

తప్పుడు నిర్ణయాలకు చెక్ పెట్టేందుకే:
'మ్యాచ్ల్లో ఎలాంటి తప్పుడు నిర్ణయాలూ వెలువడకుండా చూడాలనుకుంటున్నాం. వచ్చే సీజన్లో రెగ్యులర్ అంపైర్లతో పాటు నోబాల్స్ను పర్యవేక్షించేందుకు మరో ప్రత్యేక అంపైర్ కూడా కనిపిస్తాడు. ప్రత్యేక అంపైర్ ఆన్ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్లతో కలిసి పనిచేస్తాడు. ఈ ఆలోచన కాస్త విచిత్రంగా కనిపించినా.. మా మధ్య దీనిపై చర్చ జరిగింది' అని పాలక మండలి సభ్యుడు ఒకడు తెలిపారు.

నో పవర్ ప్లేయర్:
వచ్చే ఐపీఎల్కు ఎక్కువ సమయం లేనందున 'పవర్ ప్లేయర్'ను ఈసీజన్లో అమలు చేయడం కుదరదని గవర్నింగ్ కౌన్సిల్ తేల్చిచెప్పింది. పవర్ ప్లేయర్ నిబంధనకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆమోదముద్ర వేయలేదని సమాచారం తెలుస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనను తరువాతి ఐపీఎల్కు వాయిదా పడింది. 'ఈ అంశంపై చర్చ సాగింది. ముందుగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దీన్ని అమలు పరచాలనుకున్నాం. కానీ ఈనెల 8 నుంచే ఆ టోర్నీ ఆరంభం కానుంది. దీంతో ఈ ఆలోచన విరమించుకున్నాం' అని పాలక మండలి సభ్యుడు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications












