హైదరాబాద్: గత పదిహేను రోజులుగా తమిళనాడులో ఏం జరుగుతుందోనని యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తమిళనాడు రాజకీయాలపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది.
మామూలుగా తమిళనాడు రాజకీయాలపై ఆసక్తి లేదని, తమిళ రాజకీయనాయకుల పేర్లు చాలా క్లిష్టంగా ఉంటాయని కాస్తంత వ్యంగంగా సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.
అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు నెగ్గుతారనే విషయమై యావత్ భారతదేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సమయంలో సంజయ్ ఇలా ట్వీట్ చేయడం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా నెటిజన్లు సంజయ్ మంజ్రేకర్ ట్వీట్పై మండిపడుతున్నారు. సంజయ్ ట్వీట్పై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం స్పందించారు.
దాంతో చాలా సునాయాసంగా కామెంటరీ చెప్పే మీకు ఆ పేర్లు పలకడం మాత్రం రాదా?, దక్షిణ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడుకునే ఆరు భాషల పేర్లు చెప్పగలరా? అంటూ పలువురు నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.