నెంబర్, పేరుతో కూడిన జెర్సీలు:
ఐసీసీ తాజా నిర్ణయంతో భారత ఆటగాళ్లు కూడా వచ్చే నెలలో వెస్టిండీస్తో జరిగే సిరీస్లో నెంబర్, పేరుతో కూడిన జెర్సీలు ధరించనున్నారు. భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగనున్న రెండు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ ఆగస్టు 22న ఆంటిగ్వాలో మొదలవనుంది. వన్డేలు, టీ20ల్లో భారత ఆటగాళ్లు ఏ నెంబర్తో ఆడుతున్నారో ఆ నెంబర్తోనే టెస్టుల్లో కూడా బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
ఎవరు ధరిస్తారు:
కెప్టెన్ విరాట్ కోహ్లీ 18, వైస్ కెప్టెన్ రోహిత్ 45, శిఖర్ ధావన్ 25, జస్ప్రీత్ బుమ్రా 93, హార్దిక్ పాండ్యా 33, భువనేశ్వర్ కుమార్ 15 నెంబర్లనే ఉపయోగించనున్నారు. అయితే టెస్టు ఫార్మాట్ నుంచి రిటైరైన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వన్డేలు, టీ20ల్లో ఏడో నెంబర్ జెర్సీని ఉపయోగిస్తున్నాడు. మరి టెస్ట్ల్లో ఆ నెంబర్ జెర్సీని ఎవరు ధరిస్తారనే చర్చ మొదలైంది.
అవినాభావ సంబంధం:
టెస్టులకు ఏడో నెంబర్ జెర్సీ అందుబాటులో ఉన్నా.. దానిని మరో భారత క్రికెటర్ ఉపయోగించే అవకాశాలు తక్కువేనని బీసీసీఐ ఓ అధికారి తెలిపారు. 'ఏడో నెంబర్ జెర్సీకి ధోనీకి అవినాభావ సంబంధం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ కారణంతో ఏడో నంబర్ జెర్సీని ఎవరికీ కేటాయించకపోవ్చు. ఒక నెంబర్ జెర్సీకి బీసీసీఐ అధికారిక రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదు. కానీ భారత క్రికెట్కు ధోనీ చేసిన సేవకు గుర్తింపుగా ఆ నెంబర్ జెర్సీని ఎవరికీ ఇవ్వకపోవచ్చు' అని అన్నారు.
సచిన్ జెర్సీకి అనధికారిక రిటైర్మెంట్:
భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైరయ్యాక.. అతడి పదో నెంబర్ జెర్సీని పేసర్ శార్దూల్ ఠాకూర్ ఉపయోగించడాన్ని సచిన్ అభిమానులు ఆక్షేపించారు. దాంతో ఆ నెంబర్ జెర్సీని వన్డేలు, టీ20ల్లో ఎవరూ ధరించకుండా బీసీసీఐ దానికి అనధికారిక రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ధోనీ నెంబర్ 7 జెర్సీకి కూడా అనధికారిక రిటైర్మెంట్ ఇస్తారేమో చూడాలి.