హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనను టమిండియా పరాజయంతో ముగించింది. ఐదు వన్డేల సిరిస్ను సొంతం చేసుకున్న ఉత్సాహంతో ఏకైక టీ20లో కూడా గెలిచి విండిస్ పర్యటనను ఘనంగా ముగించాలని అనుకున్న టీమిండియా ఆశలు ఓపెనర్ ఎవిన్ లూయిస్ రూపంలో అడియాశలయ్యాయి.
ఆదివారం కింగ్ స్టన్ వేదిగా జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో కోహ్లీసేనపై వెస్టిండిస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ చేతిలో ఎదురైన వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని విండీస్ మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ (62 బంతుల్లో 125 నాటౌట్; 6 ఫోర్లు, 12 సిక్సులతో) మెరుపు సెంచరీతో రాణించగా మార్లోన్ శామ్యూల్స్ (36), క్రిస్ గేల్ (18) అతనికి చక్కటి సహకారం అందించారు. లూయస్కి ఇది భారత్పై వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం.
గతేడాది అమెరికాలోని ఫ్లోరిడాలో టీమిండియాతో జరిగిన గత టీ20 మ్యాచ్లో కూడా లూయిస్ 48 బంతుల్లోనే సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు శుభారంభం లభించింది. కోహ్లీ, ధావన్ తొలి ఓవర్ నుంచే ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుక పడటంతో 5 ఓవర్లకే 54 పరుగులు వచ్చాయి.

ఈ క్రమంలో పరుగు తేడాతో కోహ్లీ, ధావన్ పెవిలియన్కు చేరుకున్నారు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ చక్కటి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో 5 పోర్లు, 3 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్... శామ్యూల్స్ బౌలింగ్లో అవుటై త్రుటిలో అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు.
ఇక యువ ఆటగాడు రిషబ్ పంత్ కూడా 38 పరుగులు చేసి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 17వ ఓవర్లో రెండు వరుస బంతుల్లో ధోని, పంత్ను పెవిలియన్ పంపి భారత్ భారీ స్కోరుకు టేలర్ అడ్డుకట్టవేశాడు. కేదార్ జాదవ్ కూడా 4 పరుగులకే వెనుదిరిగాడు.

ఈ దశలో క్రీజులో ఉన్న జడేజా(13), అశ్విన్(11) ఆఖర్లో విజృంభించి స్కోరు బోర్డును పరిగెత్తించారు. విలియమ్స్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 18 పరుగులు రాబట్టారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 190 పరుగులు సాధించింది. విండీస్ బౌలర్లలో టేలర్, విలియమ్స్ చెరో రెండు వికెట్లు తీయగా... మార్లోన్ శామ్యూల్స్ ఒక వికెట్ తీశాడు.