
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021లో టైటిల్ ఫెవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా పూర్తిగా నిరాశపర్చింది. మెగా టోర్నీలో కనీసం సెమీస్కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. అగ్రశ్రేణి జట్లయిన పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాల తర్వాత పసికూనలైన అఫ్గనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాపై భారత్ భారీ విజయాలు అందుకుంది. అయినా కోహ్లీసేన సెమీస్కు చేరుకోలేకపోయింది. దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి నమీబియాతో భారత జట్టు చివరి నామమాత్రపు మ్యాచ్ ఆడింది. ఇక టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని ముందుగానే ప్రకటించిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్గా నమీబియాతో చివరి మ్యాచ్ ఆడేశాడు. ఈ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు.
కెప్టెన్కు సరైన ఉదాహరణ విరాట్ కోహ్లీ అని కేఎల్ రాహుల్ తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నాడు. మెగా టోర్నీలో టీమిండియాకు మద్ధతుగా నిలిచిన అభిమానులకు, హెడ్ కోచ్ రవిశాస్త్రికి ఆయన ధన్యవాదాలు తెలిపాడు. 'టీ20 ప్రపంచకప్ 2021లో మేం నిరాశపరిచాం. మా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం. మేం ఉత్తమ క్రికెటర్లుగా ఎదిగేందుకు మాకు సహకరించిన రవిశాస్త్రికి, గెలుపోటముల్లో టీమిండియాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. నాయకుడిగా టీమిండియాను ముందుండి నడిపించిన విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు. కెప్టెన్సీకి విరాట్ ఉదాహరణగా నిలిచాడు' అని రాహుల్ తన ట్వీటులో పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2021లో లోకేష్ రాహుల్ ఆడిన ఐదు మ్యాచ్ల్లో కలిపి 194 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. మెగా టోర్నీలో అతడు మూడు అర్ధ శతకాలు బాదాడు. టోర్నీలో తొలి రెండు పాకిస్థాన్, న్యూజిలాండ్లపై ఆడని రాహుల్.. చివరి మూడు మ్యాచ్ల్లో అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాలపై అర్ధ శతకాలు బాదిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, న్యూజిలాండ్లపై టీమిండియా ఓటమి పాలుకావడంతో టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దాంతో భారత అభిమానులు నిరాశకు లోనయ్యారు.
నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడంతో.. జట్టు పగ్గాలను బీసీసీఐ రోహిత్ శర్మకు అందించింది. మొత్తం 16 సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా న్యూజిలాండ్ సిరీస్కు వ్యవహరించనున్నారు. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్తో భారత్.. మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడనుంది.