49 మంది మృతి చెందగా
ఈ కాల్పుల ఘటనలో 49 మంది మృతి చెందగా... మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల దాడి నేపథ్యంలో కివీస్-బంగ్లా మధ్య మూడో టెస్టు రద్దయింది. ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడటంతో తీవ్ర ప్రాణనష్టం చోటుచేసుకుంది. కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలోనే బంగ్లా క్రికెటర్లు కూడా ఉన్నారు.
|
ప్రెస్మీట్ ఐదు నిమిషాలు ఆలస్యం కావడం వల్లే
బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ మహ్మదుల్లా ప్రెస్మీట్ ఐదు నిమిషాలు ఆలస్యం కావడం వల్ల బంగ్లా క్రికెటర్లు అంతా బ్రతికిపోయారు. ఈ ఉగ్రదాడి సమయంలో బస్సులోనే ఉన్న బంగ్లా టీమ్ వీడియో అనలిస్ట్, ముంబైకి చెందిన శ్రీనివాస్ చంద్రశేఖరన్ వెల్లడించాడు. వాళ్లక్కడికి చేరుకుంటున్న సమయంలోనే లోపల దారుణం జరిగింది.
|
తీవ్ర భయాందోళనకు గురైన బంగ్లా క్రికెటర్లు
జట్టు బస్సు ఇంకో మూడు నాలుగు నిమిషాలు ముందు వచ్చి ఉంటే క్రికెటర్లకు కూడా ప్రమాదం జరిగి ఉండేది. దీంతో బంగ్లా క్రికెటర్లు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఐసీసీతో పాటు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఊపిరి పీల్చుకున్నాయి.
ఫిబ్రవరి 10న న్యూజిలాండ్కు వెళ్లిన బంగ్లాదేశ్
న్యూజిలాండ్ గడ్డపై మూడు వన్డేలు, మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఫిబ్రవరి 10న బంగ్లాదేశ్ జట్టు వెళ్లింది. సిరీస్లో ఇప్పటికే మూడు వన్డేలు, రెండు టెస్టులు ముగియగా.. ఒక టెస్టు మాత్రమే మిగిలి ఉంది. అది కూడా శనివారం నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా.. తాజాగా కాల్పుల నేపథ్యంలో.. ఆ టెస్టుని రద్దు చేస్తున్నట్లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ప్రకటించాయి.
|
బంగ్లా జట్టు మేనేజర్ మాట్లాడుతూ
బంగ్లా జట్టు మేనేజర్ ఖలీద్ మసూద్ మాట్లాడుతూ "మేం 3-4 నిమిషాల ముందు అక్కడికి చేరుకుని ఉంటే మసీదు లోపలే ఉండేవాళ్లం. కాల్పుల్లో భాగం కానందుకు మేం నిజంగా చాలా అదృష్టవంతులం. అయితే, సినిమా తరహా దృశ్యాలు కళ్లముందే కనిపించాయి. రక్తమోడుతున్న బాధితులు మసీదు నుంచి బయటికి రావడం వీక్షించాం. ఒక 8-10 నిమిషాల పాటు బస్సులోనే ఉండిపోయాం. కాల్పుల మోతతో దాదాపు పది నిమిషాలు బస్సులోనే కిందపడుకున్నాం. దుండగుల దృష్టి బస్సుపై పడితే ప్రమాదమని భావించి అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నాం. వేగంగా నడుస్తూ హాగ్లీ ఓవల్ మైదానానికి చేరుకున్నాం" అని అన్నాడు.