ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 కోసం సెలెక్షన్ కమిటీ బలమైన టీంను ఎంపిక చేసిందని, భారత జట్టులో 5వ స్థానానికి రిషబ్ పంత్, దీపక్ హుడా మధ్య పోటీ జరుగుతుందని వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప చెప్పాడు. సెప్టెంబర్ 13న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన తర్వాత ఉతప్ప ఈ కామెంట్లు చేశాడు. 'యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అశ్విన్ అందరూ తెలివిగా బౌలింగ్ చేసేవారే. సరైన టైంలో వికెట్లు తీయగలరు. వారి ఉద్దేశం ఎప్పుడూ కూడా వికెట్లను పడగొట్టాలనే ఉంటుంది. ఇక బ్యాటింగ్లో మొదటి నాలుగు ఆప్షన్లు స్ట్రాంగ్గా కన్పిస్తున్నాయి. రాహుల్, రోహిత్, కోహ్లీ సూర్య గురించి చెప్పాల్సిన పనిలేదు. దిగువ మిడిల్ ఆర్డర్ కూడా పటిష్టంగానే ఉంది.
అయితే నంబర్ 5వ బ్యాటర్ విషయంలో మాత్రం స్పష్టత రావాల్సిన అవసరముంది.' అని ఉతప్ప పేర్కొన్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో పేర్కొంది. ఉతప్ప భారత బౌలింగ్ సెలెక్షన్ పట్ల మెచ్చుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లో భారత బౌలింగ్ విభాగం నైపుణ్యమున్న బౌలర్లతో నిండి ఉందని పేర్కొన్నాడు. రిజర్వ్ ప్లేయర్గా ఎంపికైన వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని ఎప్పుడు జట్టులోకి పిలిచినా అతని అనుభవం జట్టుకు విలువనిస్తుందని ఉతప్ప పేర్కొన్నాడు.
'నంబర్ 5 బ్యాటింగ్ ఆప్షన్లలో రిషబ్ పంత్, దీపక్ హుడా మధ్య పోటీ ఉంటుంది. ఎవరు తుది జట్టులో ఉంటారనేది చెప్పలేం. ఇకపోతే ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ను కలిగి ఉండటం చాలా ముఖ్యం.. అర్ష్దీప్ సింగ్ ద్వారా ఆ లోటు తీరిపోతుంది. అతను డెత్ ఓవర్లలో చాలా ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలడు. భువీ పవర్ ప్లేలో ఏమి చేయగలడో చూపించాడు.
అతను ఆస్ట్రేలియాలో కూడా ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలడని నేను భావిస్తున్నాను. ఫాస్ట్ బౌలింగ్ లైనప్ గురించి నేను చాలా నమ్మకంగా ఉన్నాను. బౌలింగ్ మంచి స్థితిలో ఉంది. షమీ ఎంపిక వెనుక ఓ మంచి ఆలోచన ఉండొచ్చు. అతను చాలా మ్యాచ్లు ఆడిన వ్యక్తి అని నేను భావిస్తున్నా. గతంలో జరిగిన ఐసీసీ టోర్నమెంట్లలో ఏదైనా రీప్లేస్మెంట్ అవసరమైతే.. షమీ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉండడం భారత బౌలింగ్ విభాగానికి మేలు చేస్తుంది.' అని ఉతప్ప వివరించాడు.