
లండన్: భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ వెన్నెముక విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్లో విఫలం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మాజీల నుంచి సమకాలనీ క్రికెటర్ల వరకూ అందరూ ఇదే విషయం మీదే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు. కొందరు కోహ్లీపై విమర్శల వర్షాన్ని గుప్పిస్తోన్నారు. మరి కొందరు అతనిపై భరోసాను ఉంచుతున్నారు. మళ్లీ ఫామ్లోకి వస్తాడని బలంగా నమ్ముతున్నారు. టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ సహా పాకిస్తాన్, ఇంగ్లాండ్ సారథులు బాబర్ ఆజమ్, జోస్ బట్లర్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోన్నారు.
తాజాగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనెసర్ ఈ జాబితాలో చేరాడు. విరాట్ కోహ్లీ వరుసగా విఫలమౌతున్నప్పటికీ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అతణ్ని జట్టు నుంచి తొలగించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కోహ్లీని జట్టులోకి తీసుకోకపోతే- ఆర్థికంగా బీసీసీఐ భారీగా నష్టపోతుందని అన్నాడు. అతనికి అభిమానుల నుంచి అండ బలంగా ఉందని చెప్పాడు. కోహ్లీ లేని మ్యాచ్లను ఎవరూ చూడాలని కోరుకోరని అభిప్రాయపడ్డాడు.
దీని ప్రభావం స్పాన్సరర్లపై పడుతుందని చెప్పాడు. ఇది- బీసీసీఐకి భారీ నష్టాన్ని కలిగిస్తుందని మాంటీ పనెసర్ వ్యాఖ్యానించాడు. అందుకే అతన్ని జట్టు నుంచి తొలగించే సాహసం చేయకపోవచ్చని చెప్పాడు. కోహ్లీ ఆడని మ్యాచ్కు ఆశించిన స్థాయిలో స్పాన్సరర్లు రాకపోవచ్చని బీసీసీఐ భావిస్తు ఉండొచ్చని పేర్కొన్నాడు. క్రిస్టియానో రొనాల్డో ఉదంతాన్ని ఉదహరించాడు. మాంచెస్టర్ యునైటెడ్ సాకర్ క్లబ్ తరఫున క్రిస్టియానో రొనాల్డో ఆడుతుంటే కోట్లాదిమంది అభిమానులు చూస్తారని, విరాట్ కోహ్లీ ఎపిసోడ్ కూడా ఇంతేనని అన్నాడు.
స్పాన్సరర్లను హ్యాపీగా ఉంచడానికే బీసీసీఐ.. విరాట్ కోహ్లీని జట్టులో కొనసాగిస్తోన్నట్టుగా భావించాల్సి వస్తోందని మాంటీ పనెసర్ అన్నాడు. ఇప్పటికీ అతను మోస్ట్ మార్కెటబుల్ క్రికెటరేనని కితాబిచ్చాడు. విరాట్ వల్ల ఇతర దేశాల క్రికెట్ బోర్డులు కూడా భారీగా లాభపడిన సందర్భాలు ఉన్నాయని చెప్పాడు. అతని వల్ల భారత జట్టు లాభపడుతోందా? నష్టపోతోందా? అనేది ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టిన తరువాత విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్, రెండు టీ20, ఒక వన్డే ఇంటర్నేషనల్ ఆడాడు. ఏ ఒక్క మ్యాచ్లో కూడా భారీ స్కోర్ చేయలేకపోయాడు. వరుసగా అతను చేసిన స్కోరు 11, 20, 1, 11, 16. ఇది అతనిపై తీవ్ర విమర్శల దుమారానికి దారి తీస్తోంది. అతన్ని తప్పించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.