మరికాసేపట్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మొదటి టెస్టు జరగనుంది. ప్రపంచకప్ అనంతరం విశ్రాంతి తీసుకున్న స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు.
అయితే ఈ బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా తుది జట్టు అంచనాపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా తుదిజట్టు అంచనా వెల్లడించాడు. వరల్డ్ నంబర్ వన్ టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ను భారత్ తుదిజట్టులో చూడాలని ఉందని, కానీ అశ్విన్కు చోటు దక్కదని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.

'' రవిచంద్రన్ అశ్విన్ను కాదని శార్దూల్ ఠాకూర్ను గత టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఎంపిక చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫైనల్లో మొదటి రోజు నుండి సీమర్లకు అనుకూలంగా ఉంది. శార్దూల్ ఠాకూర్ ఆ వికెట్పై ప్రభావం చూపలేకపోయినా, అతడి ఎంపిక సరైనదిగా భావించా. కానీ దక్షిణాఫ్రికాలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. పిచ్ కఠినంగా ఉంటుంది. బౌన్స్ లభిస్తుంది. ముగ్గురు పేసర్లతో పాటు ఇద్దరు స్పిన్నర్లు జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. కానీ అశ్విన్ను ఎంపిక చేయరు''
''ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ బరిలోకి దిగుతారు. మూడు, నాలుగు స్థానాల్లో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి వస్తారు. ఇక అయిదు, ఆరు, ఏడు స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్కు వస్తారు. అయితే ఎనిమిదో స్థానంలో శార్దూల్, అశ్విన్ అందుబాటులో ఉండటంతో సమస్యగా మారింది. ఆ స్థానంలో అశ్విన్ ఆడాలని భావిస్తున్నా. అలాగే బుమ్రా, సిరాజ్తో పాటు ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలను అందుకుంటాడని అనుకుంటున్నా'' అని హర్భజన్ సింగ్ అన్నాడు.