2023 - 2027ల మధ్య అయిదేళ్ల కాలానికి సంబంధించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కుల విక్రయం విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంవత్సరం రెండు కొత్త జట్లు ఐపీఎల్లో చేరినందున గత సంవత్సరాలతో పోలిస్తే ఐపీఎల్ 2022లో లాభాలు పెరుగుతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంచనా వేసింది. అయితే పలు నివేదికల ప్రకారం.. ప్రస్తుత ఎడిషన్ ఐపీఎల్లో 30 నుంచి 40%మేర తక్కువగా లాభాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ కలిగి ఉంది.
స్టార్ స్పోర్ట్స్ ప్రస్తుత 2018 -2022కాలానికి గాను రూ.16,347.5కోట్లకు ప్రసార హక్కులను దక్కించుకుంది. గతేడాదితో పోల్చితే ఐపీఎల్ చూసేవారి సంఖ్య ఈసారి బాగా తగ్గిపోయింది. అయినప్పటికీ.. బీసీసీఐ తదుపరి 2023 - 2027కాలానికి గానూ ప్రస్తుతమున్న ప్రసార హక్కుల విలువను రెండింతలు చేసి అమ్మకానికి ప్రతిపాదించింది. రూ.32,980 కోట్ల రూపాయలకు ప్రసార హక్కుల విలువను ప్రతిపాదించింది.
వీక్షకుల సంఖ్యతో నిమిత్తం లేదు
ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వ్యూయర్షిప్ తగ్గడంపై మాట్లాడుతూ.. 'వీక్షకుల సంఖ్య కొంచెం తగ్గిన మాట వాస్తవమే. కానీ అంత భారీగా వ్యూయర్ షిప్ ఏం తగ్గలేదు. వ్యూయర్ షిప్ అనేది ప్రసార హక్కుల విక్రయంపై ప్రభావం చూపిచదు.' అని హిందుస్థాన్ టైమ్స్కు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు. 'గతంలో దేశవ్యాప్తంగా కోవిడ్-19 ఆంక్షలు అమల్లో ఉండేవి. దీంతో ప్రజలు ఇండివిడ్యూల్గా ఐపీఎల్ చూసేవారు. ఇప్పుడు ఆంక్షలు తొలిగడంతో ప్రజలు బయటికి వెళ్తున్నారు. రెస్టారెంట్లు, పబ్లలో ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నారు. దీంతో ఒకే స్క్రీన్ మీద చూసేవారి సంఖ్య పెరిగింది. దాని వల్లే వ్యూయర్ షిప్ కాస్త తగ్గింది అని చైర్మన్ బ్రిజేష్ పటేల్ అన్నారు.
ప్రస్తుత సీజన్లో ఇప్పటికే 48మ్యాచ్లు పూర్తయ్యాయి. ఈ సీజన్ విజయవంతగా సాగుతోంది. ప్రస్తుతం 49వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది. గతంలో గుజరాత్ టైటాన్స్ (జీటీ)తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోగా, సన్రైజర్స్ హైదరాబాద్పై చెన్నై విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.