పుజారా మాట్లాడుతూ
పుజారా మాట్లాడుతూ "ద్రవిడ్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్ క్లాస్ బ్యాటింగ్తో అలరిస్తారు. సచిన్ విభిన్నమైన ఆటగాడు. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించేలా ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడతాడు. పరిస్థితులు అనుకూలించని సందర్భంలో సచిన్ కూడా 150 బంతుల్లో 50 పరుగులే చేశాడు. అందులో తప్పులు చూడాల్సిన అవసరం లేదు" అని చెప్పుకొచ్చాడు.
ఎలాంటి పరిస్థితుల్లో ఆడుతున్నాం
"ఎలాంటి పరిస్థితుల్లో ఆడుతున్నాం.. దానికి అనుగుణంగా బ్యాటింగ్ చేస్తున్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆసీస్ పర్యటన తర్వాత టెస్టుల్లో గొప్పగా రాణించాలంటే ఎలా ఆడాలనే విషయాన్ని అభిమానులు గ్రహించారు. టీమ్ మేనేజ్మెంట్ మాత్రమే కాదు.. క్రికెట్ అభిమానులు కూడా నేను బ్యాటింగ్ చేసిన తీరుపై ప్రశంసించడం ప్రారంభించారు" అని పుజారా అన్నాడు.
నా సామర్థ్యంపై నాకు విశ్వాసం ఉంది
"నన్ను నేను నమ్మడంతో పాటు.. నా సామర్థ్యంపై నాకు విశ్వాసం ఉంది. మిగతా వారు నా గురించి ఏమనుకుంటున్నారనే విషయంపై నేను ఆందోళన చెందను. కొన్నిసార్లు జట్టు కోసం మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది" అని పుజారా తెలిపాడు. ఆసీస్ పర్యటనలో విరాట్ కోహ్లీ ఎవరినీ కించపరచలేదని పుజారా వెల్లడించాడు.
కోహ్లీ ఆటని ఎక్కువగా గౌరవిస్తాడు
"కోహ్లీ ఆటని ఎక్కువగా గౌరవిస్తాడు. అంతేకాదు.. మైదానంలో ఎవరినీ కూడా అతను అగౌరవపరచలేదు. ఇక స్లెడ్జింగ్ అంటారా? అది ఆటలో భాగమే. అందులో ఎలాంటి తప్పు లేదు. ఏది ఏమైనా అతని అంతిమ లక్ష్యం ఒక్కటే జట్టు గెలుపు. మ్యాచ్ సమయంలో చాలాసార్లు నేను అతనికి సలహాలు ఇస్తుంటా. వాటిని అతను శ్రద్ధగా వింటాడు. మైదానంలో మాత్రం కోహ్లీ కొంచెం దూకుడుగా ఉంటాడు. అది అతని నైజం" అని పుజారా అన్నాడు.