మరికొన్నాళ్లు మహేంద్ర సింగ్ ధోనీని తమ ఫ్రాంచైజీలో కొనసాగించే ఉద్దేశంతో చెన్నై సూపర్ కింగ్స్ ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ కోసం 42 ఏళ్ల ధోనీ కసరత్తులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే గతేడాది మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ధోనీ ఫిట్నెస్తో ఉన్నప్పటికీ.. అతనికిదే ఆఖరి సీజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ధోనీ గురించి రాబిన్ ఉతప్ప కీలకవ్యాఖ్యలు చేశాడు. వికెట్ కీపింగ్ చేస్తూ ధోనీ మోకాళ్లు అరిగిపోతున్నాయని, ఎక్కువ రోజులు ఆటను కొనసాగించలేడని అన్నాడు. ''ధోనీ వీల్ చైర్లో ఉన్నా సరే.. సీఎస్కే అతడిని కొనసాగించాలనుకుంటుంది. వీల్ చైర్ నుంచి దిగొచ్చి బ్యాటింగ్ చేసి, మళ్లీ తిరిగొచ్చేస్తా చాలనకుంటుంది. అయితే బ్యాటింగ్ విషయంలో ధోనీకి ఎలాంటి ఇబ్బంది లేదనిపిస్తుంది''

''కానీ అసలు సమస్య వికెట్ కీపింగ్. తనకి ఇష్టమైన వికెట్ కీపింగ్ను చేస్తున్న ధోనీ మోకాళ్లు అరిగిపోతున్నాయి. అందుకే అతను వికెట్లను కాచుకుని ఎక్కువ రోజులు గ్లవ్స్ బాధ్యతలు అందుకోలేడని భావిస్తున్నా. జట్టుకు తన విలువ జోడించలేని స్థితిలో ధోనీ ఉంటే ఆట నుంచి తప్పుకుంటాడు. మరే ఇతర కారణాలు అతడికి అవసరం లేదు'' అని రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు.
రాబిన్ ఉతప్ప వ్యాఖ్యలతో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ ఏకీభవించాడు. జట్టులో కొనసాగమని సీఎస్కే ఫ్రాంచైజీ అభ్యర్థించినా ధోనీ పట్టించుకోడని, జట్టు ప్రయోజనమే కోరుకుంటాడని మోర్గాన్ అన్నాడు. ''తన తలరాతను తానే రాసుకునే వ్యక్తి ధోనీ. రాబిన్ చెప్పినట్లుగా ధోనీకి మోకాలి సమస్య ఉంటే ముగింపు సమయం వచ్చినట్లే.ఫ్రాంచైజీ ఉంచిన స్థానంలో ఉండటానికి ధోనీ ఇష్టపడడు. ఫ్రాంచైజీ మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాడు. అతని బాధ్యతలను ఎవరైనా తీసుకోవాలని ధోనీ కోరుకుంటున్నాడు'' అని ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. మార్చి 22న జరగనున్న ప్రారంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.