ఐసీసీ కంటే గల్లీ క్రికెట్టే నయం..
ఘనత వహించిన ఐసీసీ కంటే గల్లీ క్రికెట్ నిర్వాహకులే మేలు అని అంటున్నారు ట్విట్టరెటీస్. నిబంధనలను పక్కాగా రూపొందిస్తారని, ఇలా అడ్డగోలుగా, ఇష్టానుసారంగా ఏ ఒక్క జట్టుకో మేలు కలిగించేలా నిబంధనలను ఎప్పటికీ రూపొందించకూడదని హితవు పలుకుతున్నారు. సాధారణంగా వన్డే మ్యాచ్లు టైగా ముగియడాన్ని మనం చూస్తుంటాం. మ్యాచ్ టైగా ముగిస్తే..ఇంకో ఓవర్ అదనంగా వేయిస్తారు. ఈ సూపర్ ఓవర్లో ఎవరు ఎక్కువగా పరుగులు చేస్తే- వాళ్లే విజేతగా నిలుస్తారు. ఆ సూపర్ ఓవర్ కూడా టైగా మారితే..? సాధారణ మ్యాచుల్లో ఇలా జరిగితే ఫర్లేదనుకోవచ్చు. ప్రపంచకప్ విజేత ఎవరో తేల్చాల్సిన మ్యాచ్లో ఇదే పరిస్థితి తలెత్తింది. న్యూజిలాండ్ అద్భుత పోరాట పటిమ వల్ల సూపర్ ఓవర్ దాకా వెళ్లిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్..చివరికి అక్కడ కూడా టైగానే ముగిసింది.
లార్డ్స్లో క్రికెట్ చచ్చిపోయింది..
మక్కాగా చెప్పుకొనే లార్డ్స్ గ్రౌండ్లో క్రికెట్ను చంపేశారని నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. ఏకపక్షంగా రూపొందించిన నిబంధనల వల్లే న్యూజిలాండ్ ఓడిపోయిందంటూ ఆరోపిస్తున్నారు. లార్డ్స్ మైదానాన్ని అభిమానులు క్రికెట్ మక్కాగా పవిత్రమైనదిగా భావిస్తారని, అలాంటి చోట ఐసీసీ యాజమాన్యం క్రికెట్ను చంపేసిందని మండిపడుతున్నారు. సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ 15 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ కూడా 15 పరుగులు చేసింది. అయినప్పటికీ- లేని పరుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు స్ట్రైకర్ మార్టిన్ గప్టిల్. పరుగు రాదని తెలుసు. రనౌట్ అవుతాననీ తెలుసు. అయినప్పటికీ- పరుగెత్తాడు. అనుకున్నట్టే రనౌట్ అయ్యాడు. తెలిసి కూడా రనౌట్ ఎందుకు అయ్యాడనే అనుమానాలు తలెత్తవచ్చు. నిజానికి- సూపర్ ఓవర్ టై అయినప్పటికీ- ఇంగ్లండే విజేతగా ఆవిర్భవిస్తుంది. అందుకే- రన్ తీయడానికి పరుగెత్తాడు గప్టిల్. అవుట్ అయ్యాడు.
కివీస్ ఓడింది..అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవించినప్పటికీ.. నిజానికి గెలిచింది మాత్రం- న్యూజిలాండ్ అని వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిందని బ్లాక్ క్యాప్స్ను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. సూపర్ ఓవర్ను సైతం టైగా మలచడం.. గెలుపు అంచుల దాకా వెళ్లిన న్యూజిలాండ్ను ఐసీసీ నిబంధనలు ఓడించాయని విమర్శిస్తున్నారు. సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే- అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌండరీలను లెక్కిస్తారు. ఏ జట్టు ఎక్కువగా బౌండరీలు బాదుతుందో.. ఆ జట్టే ప్రపంచకప్ విజేత. మ్యాచ్ మొత్తం మీద ఏ జట్టు ఎక్కువగా బౌండరీలను కొట్టారో.. ఆ జట్టును విజేతగా ప్రకటించారు. న్యూజిలాండ్ తన ఇన్నింగ్లో 17 బౌండరీలను సాధించింది. ఇంగ్లండ్ 26 బౌండరీలను బాదింది. దీని ఫలితంగా- విజేతను నిర్ణయించాల్సి వస్తుంది.
ఈ రకంగా విజేతగా నిలిచిన ఇంగ్లండ్..
బౌండరీలను లెక్కించడం ద్వారా చివరికి ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవించింది ఇంగ్లీష్ టీమ్. సూపర్ ఓవర్ సైతం టైగా ముగిసిన క్షణాన.. బౌండరీల లెక్కింపు ద్వారా ప్రపంచకప్ను అందుకుంది. ఇదివరకు- మూడుసార్లు ప్రపంచకప్ ఫైనల్ గడప తొక్కినప్పటికీ.. విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సారి ఆ కరవు తీర్చుకుంది. చివరికంటా పోరాడి మరీ ప్రపంచకప్ సగర్వంగా అందుకుంది. సొంతగడ్డపై, సొంత అభిమానుల హర్షధ్వానాల మధ్య ఈ థ్రిల్లర్ మ్యాచ్లో విన్నర్గా నిలిచింది ఇవాన్ మోర్గాన్ టీమ్.
సూపర్ ఓవర్ సాగిందిలా..
న్యూజిలాండ్, ఇంగ్లండ్ల మధ్య వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ టైగా ముగియడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇంగ్లండ్ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన బెన్స్టోక్స్, జోస్ బట్లర్ బ్యాటింగ్కు దిగారు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లోఆరు బంతుల్లో 15 పరుగులు చేశారు. 16 పరుగుల విజయలక్ష్యంతో సూపర్ ఓవర్ ఆడిన న్యూజిలాండ్ 6 బంతుల్లో సరిగ్గా 15 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్మెన్ నీషమ్, గప్తిల్లు సూపర్ ఓవర్ ఆడగా, ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ వేశాడు. అయితే సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. దీంతో మ్యాచ్లో బౌండరీలు ఎక్కువగా సాధించిన జట్టు ఇంగ్లండ్ గెలుపొందినట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications












