
ప్రస్తుతం మెగా టోర్నీ ప్రపంచకప్-2019 రసవత్తరంగా సాగుతోంది. ఆస్ట్రేలియా, భారత్ సెమీస్ బెర్త్ ఖాయాం చేసుకోగా.. న్యూజీలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు మిగితా రెండు స్థానాల కోసం పోటీలో ఉన్నాయి. ఈ టోర్నీ మరో పది రోజుల్లో ముగియనుంది. అనంతరం ఆయా జట్లు ద్వైపాక్షిక సిరీస్లు ఆడనున్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మరోవైపు ఆగస్టు చివరలో యూరో స్లామ్ టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్లో ఆడేందుకు చాలామంది క్రికెటర్లు సిద్ధమయ్యారు. భుజ గాయం కారణంగా ప్రపంచకప్ టోర్నీకి దూరమైన దక్షిణాఫ్రికా స్పీడ్స్టర్ డేల్ స్టెయిన్ యూరో స్లామ్ టీ20 లీగ్లో ఆడబోతున్నాడు. ఈ విషయాన్ని లీగ్ నిర్వాహకులు సోమవారం ప్రకటించారు. స్టెయిన్తో పాటు న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ కూడా బరిలోకి దిగనున్నాడు. ప్రపంచకప్లో స్టెయిన్ ఒక్క మ్యాచ్ ఆడకపోగా.. గప్టిల్ 7 మ్యాచులలో కేవలం 157 పరుగులే చేసాడు. మరి యూరో స్లామ్ టీ20 లీగ్లో అయినా రాణిస్తాడేమో చూడాలి.
వీరితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇమ్రాన్ తాహిర్, జేపీ డుమినీ.. ఆసీస్ ఓపెనర్ క్రిస్ లిన్.. పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్, కివీస్ బ్యాట్స్మన్ ల్యూక్ రొంచీ, వాట్స్సన్, షాహిదీ ఆఫ్రిది, మెక్ కల్లమ్, ఇప్పటికే మార్క్యూ ప్లేయర్లుగా ఉండగా.. తాజాగా స్టెయిన్ ఆ జాబితాలో చేరాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా ఆడనున్నారట. యూరో స్లామ్ టీ20 టోర్నమెంట్ మొదటి ఎడిషన్ ఆగస్టు 30 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ ఆరు ఫ్రాంచైజీల మధ్య జరుగుతుంది. ఐర్లాండ్, నెదర్లాండ్ మరియు స్కాట్లాండ్ సంయుక్తంగా ఈ లీగ్ను నిర్వహిస్తాయి.