విశాఖపట్నం: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాజీ డైరెక్టర్ రవిశాస్త్రిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే సంగతి తెలిసిందే. టీమిండియా కోచ్ ఎంపిక ప్రక్రియతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. టీమిండియా కోచ్గా రవిశాస్త్రిని రిజెక్ట్ చేయడంలో గంగూలీ పాత్ర ఉందని తెలియడంతో వీరిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే.
భారత్ 1-0: విశాఖ టెస్టులో ఐదో రోజు ఆట సాగిందిలా
విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో తాజాగా రవిశాస్త్రి మరోసారి గంగూలీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రెండో టెస్టులో భాగంగా మూడో రోజు తొలి సెషన్లో రవిశాస్త్రి కామెంటరీ చెబుతూ ప్రస్తుత భారత బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉందని, ఉమేశ్ యాదవ్, షమీలను ప్రశంసించాడు.

ఈ సందర్భంలో ఉమేశ్ యాదవ్ను 'విదర్భ ఎక్స్ప్రెస్'అనీ, షమీని 'బెంగాల్ సుల్తాన్' అని రవిశాస్త్రి సంబోధించాడు. దీంతో పక్కనే ఉన్న మరో కామెంటేటర్ ఇయాన్ బోథమ్ మైక్ అందుకుని..''బెంగాల్ ప్రిన్స్' గంగూలీ ఇప్పటికే ఉన్నాడు కదా! బెంగాల్ నుంచి మరో ఐకాన్ వచ్చాడా?' అని అన్నాడు.
రెండో టెస్టులో భారత్ ఘన విజయం
దీనికి రవిశాస్త్రి స్పందిస్తూ.. 'బెంగాల్కు ప్రిన్స్లు లేరు. బెంగాల్ ఏ ఒక్క ప్రిన్స్కూ చెందినది కాదు' అని గంగూలీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీని అభిమానులు ముద్దుగా 'బెంగాల్ ప్రిన్స్' అని పిలుచుకుంటూ ఉంటారు.