హైదరాబాద్: టెస్టుల్లో 303 నాటౌట్గా నిలిచి చరిత్ర సృష్టించాడు. అయినా సరే భారత టెస్టు జట్టులో చోటు దక్కలేదు. అతడే కరుణ్ నాయర్. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరిస్లో చెన్నైలో జరిగిన ఐదో టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత టీమిండియా వరుసగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటంతో అతడికి టీమిండియా తరుపున బరిలోకి దిగే అవకాశం రాలేదు. అయితే తాజాగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం నుంచి బంగ్లాదేశ్తో జరిగే ఏకైక టెస్టులో నాయర్కు చోటు లభించలేదు.

గాయం నుంచి రహానే కోలుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న ఏకైక టెస్టులో కరుణ్ నాయర్ స్థానంలో అజ్యింకే రహానేను తీసుకుంటున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. టెస్టు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడాడు.
నాయర్తో పోలిస్తే రహానే అద్భుతంగా రాణిస్తున్నాడని, బ్యాటింగ్, ఫీల్డింగ్లో అసమాన ప్రతిభ కలిగిన గొప్ప క్రికెటర్ అని కొనియాడాడు. ఒక్క గేమ్తో గత రెండు సంవత్సరాల కృషిని అంచనా వేయలేమని, జట్టులో స్థిరత్వం ఉన్న క్రికెటర్ రహానే అని కోహ్లీ చెప్పాడు. టెస్టుల్లో రహానే యావరేజి సుమారుగా 50గా ఉందని చెప్పాడు.
గత రెండేళ్లుగా జట్టులో కొనసాగుతున్న రహానే మద్థతుగా నిలవాల్సిన సమయం ఇదేనని, యాథావిధంగా రహానే జట్టులోకి వస్తున్నాడని చెప్పాడు. టెస్టు ఫార్మాట్ మిడిల్ ఆర్డర్లో రహానే స్థిరత్వం ఉన్న ఆటగాడని కొనియాడాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా పటిష్టంగా ఉందని కోహ్లీ కొనియాడాడు.
జట్టులోని ఆటగాళ్లంతా ఆనందంగా, ఆటతీరుపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పాడు. ప్రతి ఆటగాడు ఫిట్ నెస్ కోసం ప్రత్యేకంగా శ్రమిస్తున్నారని తెలిపాడు. రంజీల్లో మంచి ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో రాణిస్తాడని ఆశిస్తున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. చైనామన్ బౌలింగ్ యాక్షన్ అతడికి అదనపు బలమని చెప్పుకొచ్చాడు.
ప్రతి అంతర్జాతీయ మ్యాచ్ తమకు కీలకమేనని, బంగ్లాదేశ్ను తేలికగా తీసుకోవడం లేదని కోహ్లీ అన్నాడు. సెషన్ వారీగా ఆధిపత్యం చేతులు మారే టెస్టుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, ఏ జట్టు కూడా ఓడించలేనంత పటిష్టంగా ఉండదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.