
అహ్మదాబాద్: మొతేరాలో జరిగిన రెండో టీ20లో కోహ్లీసేన తమ బలహీనతలను బయటపెట్టిందని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. నెమ్మది పిచ్లపై ఇబ్బంది పడే తమ బలహీనతను భారత్ బాగా ఉపయోగించుకుందని పేర్కొన్నాడు. అయితే టీ20 ప్రపంచకప్ 2021కు సన్నద్ధమయ్యేందుకు తమ ముందున్న ఏకైక దారి ఇదేనని మోర్గాన్ చెప్పాడు. చెన్నై, మొతేరా మైదానాల్లోని స్పిన్ పిచ్లపై ఇంగ్లండ్ జట్టు తడబడుతున్న విషయం తెలిసిందే. తొలి టీ20లో అద్భుతంగా ఆడిన మోర్గాన్ సేన.. రెండో టీ20లో అన్ని విభాగాల్లో తేలిపోయి మూల్యం చెల్లించుకుంది.
తాజాగా ఇయాన్ మోర్గాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'ప్రస్తుత పిచ్కు మా ఆటతీరుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. తొలి మ్యాచ్కు ఉపయోగించిన పిచ్లో మంచి వేగం ఉంది. రెండో మ్యాచ్ వికెట్ మందకొడిగా ఉంది. అది మా జట్టు బలహీనతను బయటపెట్టింది. మేం ఎక్కువగా నెమ్మది పిచ్లపై ఆడలేడు. వాటిపై ఎంత ఎక్కువగా ఆడితే అంతగా మెరుగవుతాం. పొరపాట్లు చేస్తూ వీటిపై ఎక్కువగా ఆడితేనే.. నెమ్మది పరిస్థితులను అధిగమించగలం' అని అన్నాడు.
'తొలి మ్యాచ్ వికెట్ మాకు బాగా నప్పింది. ఎందుకంటే అందులో చక్కని వేగం ఉంది. ఇంగ్లండ్లోని కార్డిఫ్ పిచ్లా అనిపించింది. కానీ ఈ పిచ్ మాత్రం మమ్మల్ని సౌకర్యవంతమైన జోన్ నుంచి బయటపడేసింది. ఐపీఎల్లో ఆడే వికెట్లా అనిపించింది. ఏదేమైనా మేం మరింత కచ్చితత్వంతో ఆడాలి. వేగంగా నేర్చుకోవాలి' అని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. రెండో మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన మోర్గాన్ సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ జేసన్ రాయ్ (46; 35 బంతుల్లో 4×4, 2×6) రాణించాడు.
'తొలుత మా ఇన్నింగ్స్ను అనుకున్నట్టే ఆరంభించాం. భాగస్వామ్యాలు నెలకొల్పాం. దూకుడు పెంచే క్రమంలో వివిధ దశల్లో వికెట్లు చేజార్చుకున్నాం. ఛేదనలో త్వరగా వికెట్ తీయడం తెలివైన పనే. కానీ భారత్ బలంగా పుంజుకుంది. విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడి మాపై ఆధిపత్యం చెలాయించారు. వారిపై మా ప్రయత్నాలు వృథానే అయ్యాయి. మూడో టీ20 బాగా ఆడుతామనే నమ్మకం ఉంది. మా ప్రణాళికలు పనిచేస్తే.. విజయవంతం అవుతాం' అని మోర్గాన్ ధీమా వ్యక్తం చేశాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య మంగళవారం రాత్రి 7 గంటలకి అహ్మదాబాద్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.